నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

by Disha Web Desk 20 |
నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి విషయంలో అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వంలో లేనప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి గడపకు తిరుగుతూ, ఏ ఆపద వచ్చిన ముందుండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు.

ఎన్నికల్లో తన గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, రానున్న సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో నేను కూడా అలాగే కష్టపడి అందరిని గెలిపించుకుంటారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వెంటనే అమలు చేయాలని, రైతులకు రైతుబంధుతో పాటు పండిన పంటలకు బోనస్ లను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వప్న కోటి, కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్ లతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story