కక్షిదారులకు రాజీయే రాజమార్గం : ఎస్పీ మహేష్ బి.గీతే

by Batti.Sumithra |

కక్షిదారులకు రాజీయే రాజమార్గం అని, లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే సూచించారు.

కక్షిదారులకు రాజీయే రాజమార్గం : ఎస్పీ మహేష్ బి.గీతే
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : కక్షిదారులకు రాజీయే రాజమార్గం అని, లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే సూచించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 28 శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని ఇరు వర్గాల పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు, ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్‌లు, ఇతర సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ కుదిరేలా అవగాహన కల్పిస్తారని తెలిపారు. తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

Next Story