ఒకరికి ఒప్పు.. మరొకరికి తప్పా?

by velandi.Saikiran |

కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మళ్లీ వివాదం చెలరేగింది. ఒకే సర్వే నెంబర్‌పై ఒకరికి అనుమతి,

ఒకరికి ఒప్పు.. మరొకరికి తప్పా?
X

దిశ, గంగాధర : కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మళ్లీ వివాదం చెలరేగింది. ఒకే సర్వే నెంబర్‌పై ఒకరికి అనుమతి, మరొకరికి నిరాకరణ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. బాధితుడు తోట శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రేకుర్తి గ్రామానికి చెందిన లేపాక్షి అపార్ట్మెంట్స్‌లోని ఒక ఫ్లాట్‌కు సంబంధించిన సేల్ అగ్రిమెంట్ డీడ్ ను అక్టోబర్ 18, 2025 న సమర్పించగా, నవంబర్ 4, 2025 న ఉత్తర్వు నం.09/2025 ద్వారా ఆ డీడ్‌ను రిజిస్ట్రేషన్‌కు ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్​ సదాశివ రామకృష్ణ నిరాకరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం బాధితుడు శ్రీకాంత్ గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్‌ సదాశివ రామకృష్ణను కారణం అడిగారు.

దానిపై సబ్ రిజిస్ట్రార్ ‘రిఫ్యూజ్ లెటర్ చదవండి’ అని చెప్పడంతో బాధితుడు ‘మీరు చదవండి’ అని కోరగా, ‘నాకు చదువు రాదు’ అని సమాధానం ఇచ్చినట్లు బాధితుడు మీడియాకు తెలిపాడు. దీంతో బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘చదువు రాకపోతే ఇక్కడ పని చేస్తున్నది ఎందుకని?’ అంటూ ప్రశ్నించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంతకుముందు అదే అపార్ట్మెంట్‌లోని మరో ఫ్లాట్‌పై మోర్ట్గేజ్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 20, 2025న జరిగిందని బాధితులు గుర్తుచేశారు. ‘అదే ఆస్తిపై ఒకసారి రిజిస్ట్రేషన్ చేయడం, మరొకసారి నిరాకరించడం ఎలా న్యాయమవుతుంది?’ అని ప్రశ్నించారు. ‘ఒక్కరికి ఒప్పు, ఒక్కరికి తప్పు ఎలా?’ అంటూ బాధితుడు ప్రశ్నించగా, అక్కడ ఉన్న ప్రజలు కూడా స్పందిస్తూ అధికారుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ ను సంప్రదించగా, ఆయన ‘దీనిపై తక్షణమే విచారణ చేపట్టి, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ, ‘ప్రజల సేవ చేయాల్సిన రిజిస్ట్రార్ కార్యాలయం ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే పౌరుల న్యాయ హక్కులు ఎక్కడికి పోతాయి?’ అని ప్రశ్నించారు. సర్వే నంబర్లలో స్పష్టత లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story