Arvind Dharmapuri: జీవన్‌రెడ్డి గెలిస్తే.. జగిత్యాల లవ్ జిహాద్ అవ్వడం పక్కా: ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
Arvind Dharmapuri: జీవన్‌రెడ్డి గెలిస్తే.. జగిత్యాల లవ్ జిహాద్ అవ్వడం పక్కా: ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిస్తే జగిత్యాల లవ్ జిహాద్‌కు అడ్డగా మారుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా.. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇది వరకే జగిత్యాల పీఎఫ్ఐ‌కి అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెబుతూ పబ్బం గడుపుతున్న జీవన్‌రెడ్డికి ఇది 15వ ఎలక్షన్ అని చురకలంటించారు. అసలు జగిత్యాలకు జీవన్‌రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మామిడి రైతులను నాశనం చేసింది, చక్కెర ఫ్యాక్టరీ మూతపడేందుకు కారణం జీవన్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు.

గల్ఫ్ కార్మికుల గోసకు అసలు కారణం కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. 40 ఏళ్లలో సీనియర్ రాజకీయ నాయకులు తీసుకురాని పసుపు బోర్డు తను తీసుకొచ్చానని, అందుకే పసుపునకు ఎన్నడూ లేని భారీగా మద్దతు ధర పలుకుతోందని తెలిపారు. ఇచ్చిన మాట తప్పినందుకు కేసీఆర్‌ను ఇంటికి పంపించారని, కానీ తాను ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చాను కాబట్లే రాబోయే ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. మోడీ సర్కార్ రాజకీయాలకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్ పీపుల్ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం భద్రంగా ఉందని కాబట్టి మరోసారి మోడీ ప్రభుత్వం రావాలంటే కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

Next Story

Most Viewed