హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం..!

by Ratna Kumari |

హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘ‌ట‌న మంగ‌ళ‌వారం క‌ల‌క‌లం రేపింది.

హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం..!
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘ‌ట‌న మంగ‌ళ‌వారం క‌ల‌క‌లం రేపింది. భార్య‌-భ‌ర్త విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల స‌మ‌యంలో భర్త కొంత డ‌బ్బు ఇస్తాన‌ని ఒప్పుకున్నాడు. అయితే ఒప్పుకున్న డబ్బులు ఇవ్వడం లేదని, పోలీసుల నుంచి ఆశించిన న్యాయం అందడం లేదనే ఆవేదనతో ఓ వివాహిత పోలీస్ స్టేషన్ ముందే డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు, పోలీసులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం తిగారం గ్రామానికి చెందిన గండ్రకోట జంపయ్య, మహాలక్ష్మి దంపతుల కుమార్తె పావనికి, హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కుంచపు అరవింద్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొద్దిరోజుల నుంచే భర్త అరవింద్ అదనపు కట్నం కోసం పావనిని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ​దీనిపై బాధితురాలు గతంలోనే హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సెటిల్‌మెంట్ కింద పావనికి రూ.9 లక్షలు ఇచ్చేందుకు భర్త అంగీకరించాడు.

​న్యాయం కోసం రోడ్డెక్కిన బాధితురాలు

​అంగీకరించిన ప్రకారం.. డబ్బులు ఇవ్వకుండా భర్త ఇబ్బంది పెడుతున్నాడని, దీనిపై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని బాధితురాలు ఆరోపించింది. గత కొద్ది నెలలుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మంగళవారం తన తల్లిదండ్రులతో కలిసి ముందుగా పొలిస్టేషన్ ముందు అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించింది. ​అరగంటకు పైగా నిరసన కొనసాగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన పావని, వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story