జూబ్లీహిల్స్‌ టికెట్‌ అంజన్ కుమార్ యాదవ్‌ ఎపిసోడ్.. ఫలించిన బుజ్జగింపులు

by Ramesh Naini |   (  Updated:2025-10-10 10:41:24  IST  )

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక టికెట్‌ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చివరికి పార్టీ నిర్ణయానికి తలొగ్గారు.

జూబ్లీహిల్స్‌ టికెట్‌ అంజన్ కుమార్ యాదవ్‌ ఎపిసోడ్.. ఫలించిన బుజ్జగింపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక (Jubilee Hills Ticket) టికెట్‌ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) చివరికి పార్టీ నిర్ణయానికి తలొగ్గారు. కాంగ్రెస్‌ టికెట్‌ లభించకపోవడంతో అలిగిన అంజన్‌ను ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్ వెంకట స్వామి కలిసి బుజ్జగించారు. దీని తర్వాత అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పని చేయాలని అంగీకరించినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉపశమనం నెలకొంది. ఈ మేరకు శుక్రవారం అంజన్ కుమార్ ఇంటికి ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మీడయాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. అంజన్‌ కుమార్‌కి త్వరలో సముచిత స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, పార్టీకి ఏది మంచిదో ఆ నిర్ణయమే తీసుకుంటారని అన్నారు. కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలుంటాయని నటరాజన్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో అందరినీ సంప్రదించిన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్‌లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని భావించారని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్ వేరే వాళ్లకు కేటాయించిందని చెప్పుకొచ్చారు. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అని తెలిపారు. రెండుసార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా పని చేశారని తెలిపారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు.. వారి హయాంలో నగరంలో పార్టీ మరింత అభివృద్ధి చెందేలా ముందుకు పోతున్నామని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుందని, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక అంజన్ కుమార్ సారధ్యంలో జరుగుతుంది.. ఆయన నేతృత్వంలో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ యాదవ్‌తో మాట్లాడారు.. కంటోన్మెంట్ ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టి కాంగ్రెస్‌ను గెలిపించారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నీ గెలిపిస్తారని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్‌లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారని కొనియడారు.

Next Story