కర్నాటకలో కాంగ్రెస్ తట్టా, పారా కిందపడేసింది : CM KCR

by Disha Web Desk 22 |
కర్నాటకలో కాంగ్రెస్ తట్టా, పారా కిందపడేసింది : CM KCR
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: 24 గంటల కరెంట్ ఇస్తామని కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ తట్టా, పారా కిందపడేసిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. రైతాంగానికి 7 గంటల కరెంట్ కూడా సరఫరా కావడం లేదని మాయమాటలు చెప్పే మోసకారుల మాటలు నమ్మవద్దని, 50 ఏళ్లు అధికారంలో ఉండగా ఏం చేయలేని వారు ఇప్పుడు ఏదో చేస్తారంటే నమ్మి మోసపోవద్దని అన్నారు. మెదక్ పట్టణంలో నిర్మించిన కలక్టరేట్, ఏస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ భవన్‌ను ప్రారంభించి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గతంలో నీళ్ల కోసం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నాలు చేసేవారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సింగూరు నీళ్లను పూర్తిగా మెదక్ అవసరాలకు వాడుకుంటున్నామని గుర్తు చేశారు.

ఘనపురం నుంచి 40వేల ఎకరాలకు సాగు నీరు, అందుతుందని గుంట ఎండిపోకుండా చేసుకుంటున్నామన్నారు. రైతు బంధు, రైతు బీమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్నప్పటికీ తాము వ్యతిరేకించామని, దీంతో కేంద్రం రూ.25 వేలు కోట్లు తెలంగాణకు నష్టం చేసిందన్నారు. ధరణి ఎత్తివేయాలనే వారిని బంగాళాఖాతంలో కలపాలని, కరోనాతో రుణమాఫీకి కొంత ఆలస్యమైందని, రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఫించన్‌లు కూడా పెంచుకుందామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధాన్యం పండిందని, రైస్ మిల్లులు సరిపోవడం లేదని, లారీలు కూడా మోయలేకపోతున్నాయన్నారు. పదేండ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది..? ఇప్పడు సంక్షేమ పథకాలతో ఎలా మారిపోయిందన్నారు. ఒక్కో ఊరిలో 60 నుంచి 70 కార్లు ఉంటున్నాయని, రైతుల జీవన శైలీలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు క్రాంతి, మహిపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed