ఓయూలో మళ్లీ ఉద్రిక్తత

by Dishanational1 |
ఓయూలో మళ్లీ ఉద్రిక్తత
X

దిశ, సికింద్రాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ఓయూలో విద్యార్ది సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి కమిషన్ చైర్మన్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని ఓయూ జేఏసి, టీఎస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం చలో ప్రగతి భవన్ కార్యక్రమం తలపెట్టి ఓయూ లైబ్రరీ నుండి ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకోవడంతో వర్సిటీ మెయిన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి పాలనలో విద్యార్డులు, నిరుద్యోగులు బలియైపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే కొడుకు ల్యాండ్ మాఫియా, కూతురు లిక్కర్ స్కాంలతో అవినీతే పాలన చేస్తున్నారని మండిపడ్డారు.


రాష్ట్ర ప్రభుత్వంతోపాటు టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలం అయిందన్నారు. పేపర్ లీకేజీ ఘనటపై సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీ ఘటనలు వరుసగా జరుగుతుండటం సిగ్గు చేటన్నారు. లీకేజీ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బట్టు శ్రీహరి, సలీం పాశ, శివరాత్రి ప్రశాంత్, శ్రీనివాస్, నవీన్ యాదవ్, వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Next Story