ఫ్రిడ్జ్ లో కుళ్లిన బిర్యానీ.. ఆన్ లైన్ లో డెలివ‌రీ..!

by Ratna Kumari |

హైదరాబాద్ న‌గ‌రంలోని ప‌లు హోటళ్లలో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసంతో తయారు చేసిన బిర్యానీ విక్రయాలు కలకలం రేపుతున్నాయి.

ఫ్రిడ్జ్ లో కుళ్లిన బిర్యానీ.. ఆన్ లైన్ లో డెలివ‌రీ..!
X

దిశ, ఖైరతాబాద్ : హైదరాబాద్ న‌గ‌రంలోని ప‌లు హోటళ్లలో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసంతో తయారు చేసిన బిర్యానీ విక్రయాలు కలకలం రేపుతున్నాయి. రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్‌తో, దుర్వాసన వస్తున్న ఆహారాన్ని స్విగ్గీ, జొమాటో ద్వారా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కుళ్లిన బిర్యానీ అమ్మిన ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. మూడు రోజుల కింద‌ట త‌యారు చేసిన బిర్యానీని ఫ్రిడ్జ్ లో భద్ర‌ప‌రిచి ఆర్డ‌ర్ రాగానే ఓవెన్ లో వేడి చేసి డెలివ‌రీ చేస్తున్న య‌జ‌మాని పై తాజాగా బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని వెంకటరమణకాలనీలో నివసించే కొండారెడ్డి ఆదివారం జొమాటోలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. రోడ్ నెంబర్-2లోనే ఉన్న లక్కీ బిర్యానీ షవర్మ రెస్టారెంట్ నుంచి డెలివరీబాయ్ చికెన్ బిర్యానీ తీసుకుని కొండారెడ్డికి అందించాడు. పొట్లం విప్పి చూడగా బిర్యానీ నుంచి దుర్వాసన వచ్చింది. దానిని పరిశీలించగా కొంత కుళ్లిపోయి కనిపించింది. వెంటనే ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు లక్కీ బిర్యానీ సెంటర్ వ‌ద్ద‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించగా.. ఫ్రిడ్జ్ లో 80 బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి. జీడిమెట్లలో సదరు హోటల్ యజమాని ఇర్ఫాన్ ఈ బిర్యానీని తయారుచేసి ఇక్కడి అవుట్ లెట్ లో భద్రపరుస్తూ ఆర్డర్ రాగానే ఓవెన్ లో వేడి చేసి ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నట్లు తేలింది. మ‌రోవైపు ఒక ఫ్రిడ్జ్ తెరిచి చూడ‌గా అందులో ఎలుకలు తిరగడం కూడా పోలీసులు గుర్తించారు. జీడిమెట్లలో మూడు రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీని ఇర్ఫాన్ ప్యాకెట్లుగా తయారుచేసి బంజారాహిల్స్ లోని తనకు చెందిన లక్కీ బిర్యానీ సెంటర్లో భద్రపరుస్తున్నట్లుగా తేలింది. దుర్వాసనలతో కూడిన బిర్యానీని సరఫరా చేసిన ఇర్ఫాన్ పై పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ ను సీజ్ చేశారు. ఈ హోటల్ లో మొత్తం ఎలుకలు, బొద్దింకలు, దుర్వాసనలు, దుర్గంధంతో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రెస్ ఉన్న విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారించారు. ఫుడ్ సేప్టీ అధికారులు కూడా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story