రూ.2 వేల నోట్ల ఎక్సేంజ్‌కు పెట్రోల్ బంక్​ బంపర్​ ఆఫర్​

by Disha Web Desk 19 |
రూ.2 వేల నోట్ల ఎక్సేంజ్‌కు పెట్రోల్ బంక్​ బంపర్​ ఆఫర్​
X

దిశ, చార్మినార్: రూ. 2వేల నోట్లు రద్దు చేస్తూ ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. దీంతో మే 23 నుంచి సెప్టెంబర్ ​30వ తేదీ లోగా రూ.2 వేల నోట్లు బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాలలో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఒక్క రోజులో గరిష్ఠంగా రూ.20వేల వరకు ఎక్సేంజ్​ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ నెల 23వ తేదీ నుంచే బ్యాంకుల్లో రూ.2వేల నోట్లు ఎక్సేంజ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అయితే రూ.2 వేల నోట్లు రద్దు చేస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న నాటి నుంచే మార్కెట్‌లో వ్యాపార లావాదేవీలతో పాటు హోటళ్లు, మాల్స్, దుకాణాలు ఇలా ఎక్కడ కూడా రూ. 2వేల నోట్లను తీసుకోవడం లేదు.

ఇదిలా ఉండగా.. రూ. 2 వేల నోట్లను మార్చుకునేవారికి పాతబస్తీలో ఓ పెట్రోల్ బంక్ ఆఫర్ ఇచ్చింది. బ్యాంకుల్లో క్యూ లైన్‌లో నిలబడి నానావస్థలు పడాల్సిన అవసరం లేకుండా తమ బంక్‌లో రూ.2 వేల నోట్లు మార్చుకోవచ్చని బోర్డ్ పెట్టింది. అయితే కస్టమర్లకు ఇక్కడ ఓ చిన్న షరతును పెట్టింది ఆ బంక్ యజమాన్యం. రెండు వేల నోటు తీసుకువచ్చిన వారు రూ.500 పెట్రోల్ పోయించుకుంటేనే రెండు వేల నోటుకు చిల్లర ఇస్తామని బంక్‌లో నోటీసు బోర్డు అతికించారు. కాగా, ఈ ఆఫర్‌ను పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని నయారా పెట్రోల్ బంక్‌ కస్టమర్లకు ప్రకటించింది. దీంతో పలువురు ఉంటే మన వాహనంలోనే పెట్రోలు ఉంటది కదా అని.. పెట్రోలు పోసుకుని రూ.2వేల నోటును వదిలించుకోవడానికి రూ.500 పెట్రోల్​ పోసుకోవడానికి కూడా వెనుకాడక పోవడం గమనార్హం.

Next Story