ఆర్టీసీ కార్మికుల‌కు సంఘీభావం తెలిపేందుకు వ‌చ్చిన బీఆర్ఎస్ నేత‌ల‌కు షాక్..!

by Ratna Kumari |

రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్ర‌వారానికి మూడో రోజుకు చేరుకుంది. తాజాగా మెహిదీప‌ట్నం ఆర్టీసీ డిపో వ‌ద్ద ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

ఆర్టీసీ కార్మికుల‌కు సంఘీభావం తెలిపేందుకు వ‌చ్చిన బీఆర్ఎస్ నేత‌ల‌కు షాక్..!
X

దిశ, కార్వాన్ : రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్ర‌వారానికి మూడో రోజుకు చేరుకుంది. తాజాగా మెహిదీప‌ట్నం ఆర్టీసీ డిపో వ‌ద్ద ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. డిపో వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులకు సంఘీభావం ప్రకటించేందుకు కార్వాన్, నాంపల్లి బీఆర్ఎస్ నేతలు ఆనంద్ గౌడ్, జీవన్ సింగ్ తమ అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. వారి రాకను గమనించిన ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. "గో బ్యాక్ బీఆర్ఎస్" అంటూ పెద్ద ఎత్తున‌ నినాదాలు చేస్తూ, నాయకులకు దూరంగా వెళ్ళిపోయారు. కార్మికులు తమకు సహకరించకపోవడంతో బీఆర్ఎస్ నేతలు వింత పరిస్థితిని ఎదుర్కొన్నారు.


మద్దతు తెలపడానికి వచ్చి చివరకు ఒంటరిగా మిగిలిపోయారు. చేసేదేమి ఆనంద్ గౌడ్, జీవ‌న్ సింగ్ ఇత‌ర నేత‌లే స్వ‌యంగా "సీఎం డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు ఈ నిరసన నుంచి పూర్తిగా తప్పుకోవడంతో కేవలం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ కనిపించారు. కాసేపు నిరసన తెలిపి వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రస్తుతం మెహిదీపట్నం డిపో వద్ద కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. కానీ రాజకీయ నేతల ప్రమేయం పట్ల కార్మికులు విముఖత చూపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story