వరుస ఘటనలు కనిపించడం లేదా.. వారికి కండకావరం తలకెక్కింది : బండి సంజయ్

by Disha Web Desk 13 |
వరుస ఘటనలు కనిపించడం లేదా.. వారికి కండకావరం తలకెక్కింది : బండి సంజయ్
X

దిశ, బేగంపేట: సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు కండకావరం తలకెక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో జరిగిన అగ్ని ప్రమాదాలు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లకు కనిపించడం లేదా.. అని వారిపై మండిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ శుక్రవారం సాయంత్రం బండి సంజయ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనల పై పూర్తి విచారణ జరిపి మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కమిటీల పేరుతో కాలక్షేపం తప్పా, ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు. వరుస ఘటనలతో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా బయటపడిందన్నారు. ఘటన జరుగగానే నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 30 మందికి పైగా అమాయకుల ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భవన యజమానులు అగ్నిమాపక నియమాలు పాటించకపోవడం వలన, ప్రభుత్వం సరియైన చర్యలు తీసుకోక పోవడం మూలంగా తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దొంగసారా కేసులో కవిత ఇరుక్కుంటే రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఢిల్లీకి వెళ్లిందని.. కానీ అగ్ని ప్రమాదాల నివారణలో అదే చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉపాధ్యాయులు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఆయన వెంట మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, కార్పొరేటర్ కొంతం దీపిక, బీజేపీ నాయకులు, చీర శ్రీకాంత్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed