Harish Rao: గాలి మాటలతో ఇంకెంత కాలం మోసం చేస్తవ్ రేవంత్ రెడ్డి ?: హరీశ్ రావు

by Prasad Jukanti |   (  Updated:2025-10-22 12:19:53  IST  )

మీ సొంత శాఖలో వేతన సమస్యలు కనిపించడం లేదా? అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

Harish Rao: గాలి మాటలతో ఇంకెంత కాలం మోసం చేస్తవ్ రేవంత్ రెడ్డి ?: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం అని గాలి మాటలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తవు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. స్కావెంజర్లకు (Scavengers) వేతనాలతో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బెనిఫిట్స్ (Retired Employees Benefits Issue) ఇప్పించాలని ఇవాళ సిద్ధిపేటలో పలు ఉపాధ్యాయ సంఘాలు హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బెనిఫిట్స్ కోసం, స్కావెంజర్ల వంటి చిరు ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. చిరు ఉద్యోగుల శ్రమను, కష్టాన్ని గౌరవించడం మీకు చేతకాదా? అని సీఎంను ప్రశ్నించారు.

మీ సొంత శాఖలో వేతన సమస్యలు కనిపించడం లేదా?:

పేద విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకం నిధులుఏడాదిగా పెండింగ్‌లో పెట్టారని, కేసీఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని నిలిపివేశారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించకుండా అమలు గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి.. మీ సొంత శాఖలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతన సమస్యలు కనిపించడం లేదా? అని నిలదీశారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి, ఆచరణలో మాత్రం గాలికి వదిలేశారని విమర్శించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలందించిన విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులైన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని మానసికంగా వేధించడం అమానవీయం, అనైతికం అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తున్నామని చెబుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆవేదన వింటే మనస్సు చలించిపోతున్నదన్నారు. మధ్యాహ్న భోజన పథకం సహా విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, స్కావెంజర్ల 9 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story