స‌ర‌స్వ‌తీ పుష్క‌రాల్లో పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు

by Bhanu |   (  Updated:2025-05-25 11:38:58  IST  )

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు ఆదివారం మ‌ధ్యాహ్నం కాళేశ్వ‌రంలో జ‌రుగుతున్న స‌ర‌స్వ‌తీ పుష్క‌రాల్లో పుణ్య‌స్నానం ఆచ‌రించారు.

స‌ర‌స్వ‌తీ పుష్క‌రాల్లో పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు ఆదివారం మ‌ధ్యాహ్నం కాళేశ్వ‌రంలో జ‌రుగుతున్న స‌ర‌స్వ‌తీ పుష్క‌రాల్లో పుణ్య‌స్నానం ఆచ‌రించారు. త్రివేణి సంగమంలో ఆదివారం పుష్కర స్నానాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు సరస్వతి ఘాట్ లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సరస్వతి ఏక శిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం 11.02 గంటలకు హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. పుష్కర స్నానానంతరం గవర్నర్ దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.


ఆలయ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు పరివట్టం, పూర్ణ కుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం తెలిపారు. గవర్నర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం అందించి, శ్వేత వస్త్రం, లడ్డు ప్రసాదం, చక్కెర పొంగలి మరియు అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ప్రతి రోజు సాయంత్రం నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమాన్ని వివరించారు. కార్యక్రమంలో అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


పుష్కర ఏర్పాట్లను గవర్నర్ పరిశీలించి అధికారులను అభినందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 11 రోజుల నుండి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు పుష్కర స్నానాలు ఆచరించాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.

Next Story