- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీల్లో పోస్టుల భర్తీపై సర్కార్ ఫోకస్..! ‘సుప్రీం’ స్టేను వెకెట్ చేయించేలా చర్యలు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నియామకాలకు ప్రధాన ఆటంకంగా ఉన్న సుప్రీం కోర్టు స్టేను వెకెట్ చేయించేందుకు తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం మంత్రి సీతక్క లా సెక్రెటరీ బీ. పాపిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్, పీఆర్సీ చైర్మన్ ఎన్.శివశంకర్ తో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల నియామకాల్లో ఎదురవుతున్న న్యాయ చిక్కులపై చర్చించి, వాటిని అధిగమించే దిశగా వారి సలహలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా కూడా పాల్గొన్నారు.
స్టేకు కారణం, పరిష్కారం..
గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్, హెల్పర్ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో రిజర్వేషన్లు 50 శాతం మించిపోయాయి. దీంతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు స్టే విధించింది. దీనిపై చర్చించిన మంత్రి స్టేను వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని లా సెక్రెటరీ పాపిరెడ్డికి సూచించారు. అధికారులు ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సమర్పించారు. ఆ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టులు ప్రభుత్వ సర్వీస్ కిందకు రాకపోవడం వల్ల 50 శాతం రిజర్వేషన్ పరిమితి వర్తించదని, ఏపీలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టులు ఎస్టీలకే రిజర్వ్ చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
త్వరగా చర్యలు చేపట్టాలి.. మంత్రి సీతక్క
మిగతా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ అదే విధానాన్ని అవలంబించి సుప్రీం కోర్టు స్టేను వెకేట్ చేయించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వెంటనే సుప్రీం కోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని సూచించారు. 10 రోజుల్లో నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంగన్ వాడీ సేవలను బలోపేతం చేసేందుకు కొత్త నియామకాలు దోహదపడతాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.






