కిటికీ ఊచలు తొలగించి.. జువైనల్ హోమ్ నుంచి నలుగురు బాల నేరస్తులు..

by Disha Web Desk 4 |
కిటికీ ఊచలు తొలగించి.. జువైనల్ హోమ్ నుంచి నలుగురు బాల నేరస్తులు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారీ అయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని నాగారంలో గల బాల నేరస్తుల పరిశీలన గృహం నుంచి నలుగురు బాల నేరస్తులు శుక్రవారం సాయంత్రం కిటికీ ఊచలను తొలగించి పరారీ అయ్యారు. అందులో ముగ్గురు పూర్వపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారు కాగా ఒకరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చెందిన వారిగా గుర్తించారు. నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో బాల నేరస్తులు జువైనల్ హోమ్ నుంచి తప్పించుకోవడం విశేషం.

గతంలోనూ బాల నేరస్తులు జువైనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. అయితే భద్రత చర్యల విషయంలో నిర్లక్ష్య ధోరణి కారణంగా తాజాగా నలుగురు పరారీ అయ్యారు. ఈ మేరకు జువైనల్ హోం నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జువైనల్ హోమ్ నుంచి పరారైన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు వైర్లెస్ మెసేజ్ అన్ని పోలీస్ స్టేషన్‌కు పంపించారు. శుక్రవారం రాత్రి బాల నేరస్తుల కోసం పోలీస్ శాఖ జల్లెడ పడుతుంది. పరారీ అయిన వారిలో కొందరిపై హత్య అభియోగాలు ఉన్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed