16 సీట్లు రావాలని మొక్కుకున్నా.. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
16 సీట్లు రావాలని మొక్కుకున్నా.. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శనివారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ 16 సీట్లు గెలవాలని మొక్కుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు పాజిటివ్ వాతావరణం ఉందని.. మరోసారి తమ పార్టీ సత్తా ఏంటో పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ 50 వేశాలు వేసిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణలోని ఆలయాలు అభివృద్ధి చెందాయని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొండగట్టు ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆలయాలు మళ్లీ అభివృద్ధికి ఆమడదూరంలోకి వెళ్లాయని అన్నారు. ముందు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకొని అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసి బీఆర్ఎస్‌పై నిందలు వేయడం ప్రారంభించారని అన్నారు.


Next Story