కొట్టుకుపోయిందన్న కాళేశ్వరంలో జలహోరు ఎలా స్టార్ట్ అయ్యింది..? రేవంత్ సర్కార్‌పై KTR ఫైర్

by Disha Web Desk 19 |
కొట్టుకుపోయిందన్న కాళేశ్వరంలో జలహోరు ఎలా స్టార్ట్ అయ్యింది..? రేవంత్ సర్కార్‌పై KTR ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని అన్నారు. తెలంగాణ పల్లెలు తాగునీరు లేక తల్లడిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాలు దాహార్తితో అలమటిస్తున్నాయి.. నగరాల్లో మళ్లీ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయన్నారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని.. మంచీనీళ్లు మహాప్రభో అంటూ ప్రజలు అల్లాడుతున్నారని బాధపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన వనరులను ఢిల్లీకి తరలించడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజలకు జల వనరులను అందించడంలో లేదని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని మారుమూల తండాలకు కూడా తాగునీరు అందిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో మళ్లీ జోరుగా ట్యాంకర్ల దందా నడుస్తోందని మండిపడ్డారు. మేం మంచి నీళ్లను మానవ హక్కుగా పరిగణించాం.. కానీ నీటి విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఓ ప్రణాళిక లేదని విమర్శించారు. ఎండాకాలం ఆరంభంలోనే తాగునీట కటకట ఏర్పడింది.. ఇది ప్రకృతి ద్వారా వచ్చిన దుస్థితి కాదు.. కాంగ్రెస్ సర్కార్ సృష్టించిన కృత్రిమ కొరతే కారణమన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఉపయోగించుకునే తెలివి లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు కాదు.. రైతుల కోసం ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తండని సెటైర్ వేశారు.

ఫోన్ ట్యాపింగ్‌పై కాకుండా.. వాటర్ ట్యాప్‌లపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి నీటి కేటాయింపుపై అసలు శ్రద్దే లేదని.. రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పొలం బాటపట్టిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో గాయత్రి పంప్ హౌజ్ ఎలా స్టార్ట్ అయ్యిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్కామ్‌గా చూపెట్టాలని చూశారని.. కొట్టుకుపోయిందని చెప్పిన కాళేశ్వరంలో జలహోరు ఎలా వచ్చిందని నిలదీశారు. పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం కావాలనే రైతుల పంటలు ఎండిపోయేలా కుట్ర చేసిందని ఆరోపించారు.



Next Story