గజ్వేల్‌పైనే ఫోకస్.. ఈటల పోటీతో BRSలో కొత్త టెన్షన్!

by Disha Web Desk 4 |
గజ్వేల్‌పైనే ఫోకస్.. ఈటల పోటీతో BRSలో కొత్త టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ఏర్పడిన కొత్తలో గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్‌కు 20 వేల ఓట్ల కంటే తక్కువ మెజారిటీ వచ్చినా 2018 ఎన్నికల్లో మాత్రం 58 వేల మార్జిన్ దాటింది. ఈసారి అంతకంటే ఎక్కువ రికార్డు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పార్టీ లోకల్ లీడర్ల అభిప్రాయం. బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే బీసీలకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని, టికెట్లు 22 మందికి మాత్రమే ఇచ్చిందనే అపవాదు ఆ పార్టీపై ఉన్నది. కనీసం ఒక్క ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ కారణంగానే పటాన్‌చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్ బీఆర్ఎస్‌కు మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేస్తే ఆ కులం ఓట్లు దూరమవుతాయని బీఆర్ఎస్ ఆందోళన పడుతున్నది. బీసీలంతా ఆయన వైపు టర్న్ అవుతారనే అనుమానమూ లేకపోలేదు. ఈసారి ఏ మాత్రం ఓట్లు తగ్గినా అది ఈటల ఎఫెక్ట్ అనేది జనంలోకి వెళ్తుందని, ఆ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ఇప్పటి నుంచే ఏదైనా చేయాలని హరీశ్‌రావు భావిస్తున్నారు. ఆ నియోజకవర్గ బాధ్యతలను హరీశ్‌రావుకే అప్పగించారు కేసీఆర్. గతంలో జరిగిన ఎన్నికల్లో రెండు పక్షాల మధ్యనే పోటీ నెలకొన్నది. ఈసారి కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పోటీ ఉండడంతో ఓట్ల చీలిక ప్లస్ అవుతుందా?.. లేక ముప్పు తెస్తుందా అని బీఆర్ఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు.

ఈటల, కాంగ్రెస్ ఎఫెక్ట్ వల్లనే కేసీఆర్ మైలేజ్ తగ్గిపోయిందనే అపవాదు రాకుండా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవల్‌లో కసరత్తు మొదలైంది. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు ఒక దఫా మీటింగ్ పెట్టారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ తప్పుకుని ముదిరాజ్ లేదా తెలంగాణ ఉద్యమకారులను గజ్వేల్ నుంచి నిలబెడితే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం కొద్దిమంది స్థానికుల నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు తగిన పావులు కదిపి నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆర్, హరీశ్‌రావు మాత్రమే.



Next Story

Most Viewed