నామినేటెడ్ పదవులపై పై మీనాక్షి నటరాజన్ సమక్షంలో తుది నిర్ణయం

by Malleboina Mahesh |

నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. ఈ నెల 15, 16 తేదీల్లో ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం.

నామినేటెడ్ పదవులపై పై మీనాక్షి నటరాజన్ సమక్షంలో తుది నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : నామినేటెడ్ పదవుల విషయంలో ఎవరికి రెన్యువల్ చెయ్యాలి? ఎవరిని పక్కన పెట్టాలి? కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? అనే అంశంపై పార్టీ, ప్రభుత్వ పెద్దల్లో పెద్ద ఎత్తున చర్చోప చర్చలు జరుగుతున్నాయి. పనితీరు ఆధారంగా నియామకాలు జరపాలని భావిస్తోన్న సీఎం రేవంత్.. పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో తుది నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 14న పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి హైదరాబాద్‌కు రానున్నారు. 15 లేదా 16 తేదీల్లో నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమై నామినేటెడ్ పదవుల నియామకం పై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఒక్కో పదవికి 10 మంది పోటీ..

ఈ నెల 8న 37 మంది నామినేటెడ్ చైర్మన్ల రెండేళ్ల పదవీకాలం ముగిసింది. ఈ పదవులను దక్కించుకునేందుకు తాజా మాజీ చైర్మన్లు, అసలే పదవులు దక్కని లీడర్లు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పదవి ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ సౌకర్యం లభిస్తుంటుంది. మంత్రులు, అధికారుల వద్దకు ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది. వీటికి తోడు ప్రభుత్వం కల్పించే వెహికల్, గన్‌మెన్ సౌకర్యంతో రాజకీయంగా పరపతి పెరుగుతుంది. రాజకీయాల్లో మరింత ఎత్తుకు ఎదిగేందుకు వెసులుబాటు కలుగుతుంది. అందుకని చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే తపనలో లీడర్లు ఉన్నారు. దీంతో ఒక్కో పదవికి సుమారు 10 మంది వరకు పోటీ పడుతున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పెద్ద ఎత్తున లాబీయింగ్

చైర్మన్ పదవులను దక్కించుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్న లీడర్లు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. ముందుగా జిల్లాకు చెందిన మంత్రుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ తరువాత జిల్లా ఇన్‌చార్జిల మనస్సు గెలుచుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈ రెండు చోట్ల లైన్‌క్లియర్ అయిన వెంటనే ప్రభుత్వంలోని కీలక నేతల ఆశీస్సుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. కొందరు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీలోని కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వద్దకు వెళ్లి పదవి ఇప్పించాలని ప్రాధేయపడుతున్నట్టు తెలిసింది.

మరో ఛాన్స్ కోసం..

తాజా మాజీ చైర్మన్లు అందరూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో కొందరికి మాత్రమే రెన్యువల్ చేసే అవకాశం ఉంది. చైర్మన్ హోదాలో సదరు నాయకుడు పనితీరు ఆధారంగా మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. అదే సంస్థకు చైర్మన్ పదవి ఇవ్వాలా? లేక మరో సంస్థ బాధ్యతలు అప్పగించాలా? అనే అంశంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. కొందరు పాత సంస్థలో మరోసారి పని చేసేందుకు మొగ్గుచూపుతుండగా, మరికొందరు కొత్త సంస్థలో పనిచేసేందుకు చొరవ చూపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

ఎమ్మెల్యేలకు సైతం పదవులు

ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో ఎమ్మెల్యేలు సైతం జాబితాలో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఆర్టీసీ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ లాంటి కీలక సంస్థల చైర్మన్ పదవులు ఇచ్చే చాన్స్ ఉందని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. గతంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ పదవిని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌కు కేటాయించారు. కానీ ఆయన ఆ పదవిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు కీలకమైన సంస్థలకు చైర్మన్లుగా నియమించే చాన్స్ ఉంది.‘‘ఈసారి పెద్ద మొత్తంలో నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుంది. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లను సైతం ప్రకటించవచ్చు’ అని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు.

Next Story