కవితకు ఈడీ నోటీసులు : కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేకనే.. : ఇంద్రకరణ్ రెడ్డి

by Disha Web Desk 4 |
కవితకు ఈడీ నోటీసులు : కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేకనే.. : ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ద‌ర్యాప్తు సంస్థలు కేంద్రం చేతులో కీలుబొమ్మలుగా మారాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర‌ణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ క‌విత‌కు ఈడీ నోటీసులపై మంత్రి ఇంద్రకర‌ణ్ రెడ్డి స్పందించారు. బుధవారం సాయంత్రం నిర్మల్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థల్ని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేస్తోందని మండిప‌డ్డారు.

విపక్షాలను నిలువరించేందుకు, నాయకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని ధ్వజమెత్తారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కోరుతూ ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయాలని నిర్ణయించార‌ని, ఈ నేప‌థ్యంలోనే నోటీసులు జారీ చేయ‌డం చూస్తే బీజేపీ క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌కు ఇది నిద‌ర్శన‌మ‌న్నారు. తెలంగాణ‌లో బీజేపీ ఆట‌లు సాగ‌వని, సీయం కేసీఆర్ ఎవ‌రికీ త‌ల‌వంచే ర‌కం కాదని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్సీ క‌విత‌ను టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాల‌ను బీఆర్ఎస్ పార్టీ ఎండ‌గ‌డుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవ‌లం ప్రతిప‌క్షాల నాయ‌కుల‌ను టార్గెట్‌గా చేసుకుని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుంద‌ని, మ‌రి బీజేపీ నేత‌ల‌పై ఎందుకు దాడులు చేయ‌డం లేద‌ని, వారంతా నీతిమంతులేనా..? అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed