ఎవరా నలుగురు.. IAS వర్గాల్లో గుబులు రేపుతోన్న బండి సంజయ్ ఢిల్లీ టూర్..!

by Disha Web Desk 19 |
ఎవరా నలుగురు.. IAS వర్గాల్లో గుబులు రేపుతోన్న బండి సంజయ్ ఢిల్లీ టూర్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అవినీతి అధికారుల భరతం పట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. కరప్షన్‌కు పాల్పడిన కలెక్టర్లకు షాకివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నలుగురు కలెక్టర్ల అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. నేడో, రేపో డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) కార్యాలయంలో ఫిర్యాదు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల్లో వణుకు మొదలైంది. రాష్ట్రాన్ని నలుగురు ఐఏఎస్‌లు దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నలుగురు అధికారులు ఎవరు అనే అంశంపై అధికారుల్లో గుబులు మొదలైంది. అసలు సంజయ్ వద్ద ఉన్న ఆధారాలేంటి? ఎవరా నలుగురు కలెక్టర్లు అనేది చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబీకులతో సన్నిహితులుగా మెలిగే ఐఏఎస్ ఆఫీసర్లే బీజేపీ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పలు శాఖల్లో ఉన్న ఐఏఎస్‌లు చేస్తున్న అవినీతిపై చిట్టాను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ధరణి పేరిట అక్రమంగా సంపాదిస్తున్న వారి లిస్టును బండి వద్ద ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన కలెక్టర్ల పేరు సైతం ఉన్నట్లు టాక్. కొద్దిరోజులుగా ఈ అంశాలపై బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్ వద్ద కేవలం నలుగురు కలెక్టర్లకు సంబంధించిన అవినీతి చిట్టా మాత్రమే ఉందా? ఇంకొందరి కరెప్షన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బండి ఐఏఎస్ అధికారుల అవినీతిపై కామెంట్స్ చేసినప్పటి నుంచి అధికారుల్లో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. ఆ లిస్టులో తామెక్కడ ఉంటామోననే గుబులు పలువురు అధికారులకు పట్టుకుంది.

ఉమ్మడి వరంగల్‌లో కొత్తగా ఏర్పడిన ఓ జిల్లాలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పేరు ఈ లిస్ట్‌లో ఉన్నట్లు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ జాబితాలో ఆయనకు సంబంధించిన పూర్తి ఆధారాలు సంజయ్ సేకరించినట్లు సమాచారం. కేసీఆర్ కుటుంబం అండగా ఉందనే ధీమాతో పలువురు కలెక్టర్ల అవినీతి అంతేలేకుండా పోయిందని, వారి అవినీతి చిట్టా అంతలా ఉందనే చర్చ అటు అధికార వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ నలుగురి వల్ల ఇతర ఐఏఎస్ అధికారులకూ చెడ్డపేరు వస్తోందనే భావన తోటి ఐఏఎస్ అధికారుల్లోనూ ఉన్నట్లు వినికిడి. అంతేకాకుండా తామేం చెబితే అదే చెల్లుతుందనే ధోరణిలో అవినీతి కలెక్టర్లు మెలిగేవారని టాక్. బండికి పూర్తిస్థాయిలో ఈ అవినీతి చిట్టా ఎలా దొరికిందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సంజయ్ సేకరించిన సమాచారంతో పాటు పలువురు అవినీతి ఐఏఎస్‌ల చిట్టాపై తోటి ఐఏఎస్ అధికారులూ ఉప్పందించారనే చర్చ సాగుతోంది. వారి వల్ల ఇతరులకూ చెడ్డపేరు వస్తుందనే భావనతో అందించి ఉంటారని టాక్.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం నలుగురు ఐఏఎస్‌లకు సంబంధించిన అవినీతిపై పూర్తి ఆధారాలతో ఢిల్లీకి పయనమయ్యారు. నేడో, రేపో ఆయన డీవోపీటీలో ఫిర్యాదు చేయనున్నారు. అయితే బండి వద్ద ఉన్న అవినీతి చిట్టాలో నలుగురు ఐఏఎస్‌లకు చెందినవే ఉన్నాయా? ఇంకా ఇతర ఐఏఎస్‌లవి కూడా ఉన్నాయా? అవినీతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరించారు? ఇంకెంత మందికి సంబంధించిన వివరాలు ఆయన వద్ద ఉన్నాయి? అనే ప్రశ్నలు అధికారులను ఆందోళనలోకి నెట్టేశాయి. ఇతర శాఖలకు చెందిన అధికారులు సైతం వణికిపోతున్నారు.

ఇవి కూడా చదవండి :KCR భారీ స్కెచ్.. జర్నలిస్టులకు ఎలక్షన్ గిఫ్ట్?

Next Story