CM Revanth Reddy : అత్యాధునిక వసతులతో 4 గోశాలల నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

రాష్ట్రంలో గోవుల సంర‌క్షణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు.

CM Revanth Reddy : అత్యాధునిక వసతులతో 4 గోశాలల నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో గోవుల సంర‌క్షణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాల‌ అధ్యయ‌నానికి ముగ్గురు అధికారుల‌తో ఒక క‌మిటీని నియ‌మించారు. ప‌శు సంవ‌ర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి స‌బ్యసాచి ఘోష్‌, దేవాదాయ శాఖ ముఖ్య కార్యద‌ర్శి శైల‌జా రామ‌య్యర్ గారు, వ్యవ‌సాయ శాఖ కార్యద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావుతో కూడిన క‌మిటీ ఈ విష‌యంలో లోతైన అధ్యయ‌నం చేయాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గో సంర‌క్షణ‌పై సీఎం రేవంత్ రెడ్డి త‌న నివాసంలో మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari)తో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో స‌మీక్షించారు.

మ‌న సంస్కృతిలో గోవుల‌కు ఉన్న ప్రాధాన్యం, భ‌క్తుల మ‌నోభావాలను దృష్టిలో ఉంచుకోవ‌డంతో పాటు గోవుల సంర‌క్షణే ప్రధానంగా విధానాల రూప‌క‌ల్పన ఉండాల‌ని ముఖ్యమంత్రి చెప్పారు. కోడె మొక్కులు చెల్లించే దేవాలయాలైన వేముల‌వాడ‌(Vemulawada), యాద‌గిరిగుట్టతో పాటు, హైద‌రాబాద్ న‌గ‌ర స‌మీపంలోని ఎనికేప‌ల్లి, ప‌శు సంవ‌ర్థక శాఖ విశ్వవిద్యాల‌యం స‌మీపంలో తొలుత గోశాల‌లు(Goshala) నిర్మించాల‌ని చెప్పారు. భ‌క్తులు స‌మ‌ర్పించే కోడెల ప‌ట్ల ప్రత్యేకమైన‌ శ్రద్ధ క‌న‌ప‌ర్చాల‌ని, వేముల‌వాడ స‌మీపంలో వంద ఎక‌రాల‌కు త‌క్కువ కాకుండా గోశాల ఉండాల‌ని చెప్పారు. భ‌క్తులు గోశాల‌ల‌కు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నార‌ని.. స్థలాభావం, ఇత‌ర స‌మ‌స్యల‌తో అవి త‌ర‌చూ మృత్యువాత ప‌డుతున్నాయ‌ని ముఖ్యమంత్రి ఆవేద‌న వ్యక్తం చేశారు.

ఆ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించి గోవుల‌ సంర‌క్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వ‌స‌తుల‌తో గోశాల‌లు నిర్మించాల‌ని సూచించారు. గో సంర‌క్షణ విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత‌ ఖర్చయినా వెనుకాడ‌ద‌ని సీఎం గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గోశాల‌ల నిర్వహ‌ణ‌కు సంబంధించిన అప్రోచ్ పేప‌ర్‌ను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు అంద‌జేశారు.

Next Story