వందరోజుల్లో గ్యారంటీలన్నీ అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
వందరోజుల్లో గ్యారంటీలన్నీ అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎం రేవంత్ భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ మాట తప్పన దాఖళాలు లేవని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసి చూపించామని చెప్పారు. ఇవాళ భద్రాచలం రాములోరి ఆశీర్వాదం తీసుకొని ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్కీమ్ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవమే ఈ ఇందిరమ్మ ఇళ్లు అని అభిప్రాయపడ్డారు. పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.

ఇల్లాలి ముఖంలో ఆనందం ఉందంటే ఆ ఇల్లు బాగున్నట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంటి నిర్వహణ మహిళ చేతిలో ఉంటే ఇల్లు బాగుంటుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుమీదే ఇస్తామని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని.. పేదల కలలతోని కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. అల్లుడొస్తే కాళ్లు గోడకు తాకొద్దని.. విశాలమైన ఇళ్లు ఇస్తామని కాలయాపన చేశారని గుర్తుచేశారు.



Next Story