బడ్జెట్‌లో లక్షల కోట్లు కేటాయించినా ప్రజల బతుకులు మారలేదు: భట్టి

by Disha Web Desk 2 |
బడ్జెట్‌లో లక్షల కోట్లు కేటాయించినా ప్రజల బతుకులు మారలేదు: భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వరాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. పండిట్ జవహార్ లాల్ నెహ్రు ఫిలాసఫీని స్పూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లితే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరడమే కాకుండా, తెలంగాణ వివిధ రంగాల్లో అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. నీళ్లు, నిధులు, నియమకాలు, ఆత్మగౌరవం వంటివన్నీ ఇప్పటికీ సంపూర్ణంగా నెరవేరలేదని, ఆ బాధ్యత బీఆర్ఎస్​ ప్రభుత్వం మీద ఉన్నదని భట్టి గుర్తు చేశారు.

రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్ బరీ, తెలంగాణ తొలి ఉద్యమం, మలిదశ ఉద్యమాలు ఆత్మగౌరవం, భూమి కోసమే జరిగాయని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన రాజ్యంగ ప్రక్రియను గతంలో మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగా డిప్యూటీ స్పీకర్‌గా తాను ఆ బిల్లును ఆమోదింప చేసి కేంద్రానికి పంపించానని గుర్తుచేశారు. స్వరాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు దాదాపుగా 17.39 లక్షల బడ్జెట్‌ను పెట్టినా, పేద ప్రజలకు న్యాయం జరగలేదన్నారు.

నిరుద్యోలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. భూమిలేని నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. భూ సేకరణ చేసి ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. ప్రతి మండలంలో కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే పాఠశాలలు నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ప్రయివేటు యూనివర్శీటీల్లో ఫీజుల భారంతో చదువలేని పేద విద్యార్థులను ఆదుకోవాలన్నారు. దీంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషిచేసే సర్పంచ్‌లకు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.

Next Story