తెలంగాణ భవన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెక్ట్స్ ఫోకస్

by Disha Web Desk 2 |
తెలంగాణ భవన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెక్ట్స్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం ఒక్కో శాఖపై సమీక్ష జరుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ విషయాన్నీ టేకప్ చేయాలనుకుంటున్నారు. దాదాపు పదేండ్లుగా అక్కడ ప్రత్యేక ప్రతినిధి (స్పెషల్ రిప్రజెంటేటివ్) వ్యవస్థ కొనసాగుతూ ఉన్నదని, దాని ద్వారా ఒనగూరిన ప్రయోజనాలేమీ లేకపోయినా ప్రతి నెలా జీతం, అలవెన్స్ తదితర రూపాల్లో ఆర్థిక భారమే పడుతున్నదనే అభిప్రాయం ఉంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండురోజుల క్రితం ఫస్ట్ టైమ్ ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడి రెసిడెంట్ కమిషనర్‌తో ప్రాథమిక స్థాయిలో తెలంగాణ భవన్ విధివిధానాలు, పనితీరు, ప్రయోజనం లేకుండా కంటిన్యూ అవుతున్న విభాగాలు తదితరాలను ప్రస్తావించినట్లు సమాచారం.

ఫలితాలు రాకున్నా కొనసాగింపు...

ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రభుత్వ వ్యవస్థగా పనిచేయడం కంటే బీఆర్ఎస్ పార్టీ పునరావాస కేంద్రంగా మారిందనే సాధారణ అభిప్రాయం నెలకొన్నది. ఆ పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తులను వేర్వేరు పదవుల్లో అక్కడ నియమించడం, కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో అపాయింట్ చేయడం, ఆ విభాగాలకు నిర్దిష్టమైన టాస్క్ ఉన్నా ఫలితాలు మాత్రం ఆశించిన తీరులో లేకపోవడం, అయినా అవి కొనసాగుతూనే ఉండడం.. ఇలాంటి అంశాలన్నీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. భవన్ వ్యవహారాలను సెక్రటేరియట్‌లోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సీరియస్‌గా పర్యవేక్షించకపోవడంతో అదో ప్రత్యేక వ్యవస్థగానే కొనసాగుతున్నది. హైదరాబాద్ స్థాయిలో పరిపాలనను గాడిన పెట్టిన తర్వాత ఢిల్లీ తెలంగాణ భవన్‌ సంగతి చూద్దామనే భావన అధికారుల్లో ఉన్నది.

ప్రయోజనం లేని వ్యవస్థ..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక ప్రతినిధులుగా రామంచంద్రు తేజావత్, వేణుగోపాలచారి, కేఎం సాహ్నిలను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని నిధులు, అనుమతులు తెప్పించడంతోపాటు రెండు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేసేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రామచంద్రు తేజావత్, వేణుగోపాలచారి పదవీకాలం ముగియడంతో తప్పుకున్నారు. కానీ కేఎం సాహ్ని మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నారు. నెలకు లక్ష రూపాయల జీతంతో పాటు ప్రభుత్వ వాహనం (సొంతది వాడుకున్నట్లయితే నెలకు రూ. 30 వేల అలవెన్సు), రూ. 15 వేల చొప్పున డీజిల్ కోసం పేమెంట్, ఒక పర్సనల్ సెక్రటరీ, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు సబార్డినేట్లు, ఒక డ్రైవర్‌ను కేటాయించారు.

వచ్చేది ఏడాదికి రెండుసార్లే..

ప్రత్యేక ప్రతినిధిగా కేఎం సాహ్ని సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే భవన్‌ను సందర్శిస్తారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రోజు (జూన్ 2), ఆ తర్వాత పంద్రాగస్టు సెలబ్రేషన్స్ కు మాత్రమే హాజరవుతారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో టూరిజం, లా డిపార్టుమెంటు, ఇంజనీరింగ్ సెక్షన్.. ఇలాంటివన్నీ ఉన్నా వాటి పనితీరుపై సమీక్షలే ఉండవు. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేవారి కుటుంబ సభ్యులే వేర్వేరు విభాగాల్లో పైరవీలతో పోస్టులు సంపాదించుకున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. కేంద్రంలోనూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల మధ్య లైజనింగ్ కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఫంక్షనింగ్‌ను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.


Next Story

Most Viewed