తెలంగాణ సర్కార్ అప్పులపై కేంద్రం సంచలన ప్రకటన

by Disha Web Desk 4 |
తెలంగాణ సర్కార్ అప్పులపై కేంద్రం సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులతో పాటు సంక్షేమ పథకాల అమలుతో కేవలం ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ.4 లక్షల కోట్ల అప్పును కలిగి ఉంది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. ప్రభుత్వ అప్పులపై కేంద్రం సంచలన విషయాలు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఏకంగా రూ.1,61,455 కోట్ల రుణం తీసుకున్నట్లు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌, నాబార్డు లాంటి ఆర్థిక సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.29,136 కోట్లు, 2019-20లో రూ.38,285 కోట్లు, 2020-21లో రూ.44,834 కోట్లు, 2021-22 బడ్జెట్‌లో రూ.49,200 కోట్ల రుణం తీసుకుందని, రుణాలను చూపినట్లు ఆయన పేర్కొన్నారు.

బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.1,55,133 కోట్లు తీసుకోగా.. నాబార్డు, ఎన్‌సీడీసీ, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, మరికొన్ని ఇతర సంస్థల నుంచి రూ.5,082 కోట్లు తీసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రూ.1,240 కోట్ల రుణం తీసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా విభజన చట్టంపై రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర మంత్రి పంకజ్‌.. తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450 కోట్లు కేటాయిస్తున్నామని, గత ఐదేళ్లలో రూ.2,250 కోట్లు అందించినట్లు వెల్లడించారు. అంతేగాకుండా, ఎస్టీ రిజర్వేషన్‌ను పెంచేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఎంపీ ఉత్తమ్ అడిగిన ప్రశ్నకు గిరిజన శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ కేసీఆర్ సర్కార్‌కు షాక్ ఇచ్చే సమాధానమిచ్చారు. ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర గిరిజన శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని తేల్చి చెప్పారు. అదీగాక, ప్రధానమంత్రి ఆది ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన కింద తెలంగాణకు 2020-21లో రూ.41.91 కోట్లు విడుదల చేశామన్నారు.



Next Story

Most Viewed