కేసీఆర్ మానసికంగా గట్టివారు.. తిరిగి ప్రజల్లోకి వస్తారు: MLC

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-07 17:02:43  IST  )

రేవంత్‌ రెడ్డికి సీఎం కుర్చీ పదవి, దోపిడీపై మాత్రమే ప్రేమ ఉందని.. ఆయన పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ సూచించారు.

కేసీఆర్ మానసికంగా గట్టివారు.. తిరిగి ప్రజల్లోకి వస్తారు: MLC
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌ రెడ్డికి సీఎం కుర్చీ పదవి, దోపిడీపై మాత్రమే ప్రేమ ఉందని.. ఆయన పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ సూచించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి రివేంజ్ రెడ్డిగా మారారని.. ఆయన లాంటి ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని అన్నారు. కర్నూల్ ఫ్యాక్షనిస్ట్‌లా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాను ప్రజల కోసం సీఎం కాలేదని.. పగ కోసం అయ్యానని రేవంత్‌రెడ్డి చెప్పారని.. లక్ష్మీనరసింహస్వామి ఆయనతో నిజం చెప్పించారని అన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చి పగతో, కక్షతో పాలన చేస్తున్న ఆయనకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. ఆయన ఏ కారణంతో జైలుకు వెళ్లారో ప్రజలకు తెలుసని.. చంద్రబాబు చెంచాగా మారి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారని ఆరోపించారు.

కేసీఆర్ మానసికంగా గట్టివారని.. తెలంగాణ కోసం తిరిగి ప్రజల్లోకి వస్తారని చెప్పారు. తెలంగాణలో ట్రిలియన్ ఎకానమీ అంటున్న రేవంత్ రెడ్డికి ట్రిలియన్ లో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పట్టిన చీడపురుగు రేవంత్ అని విమర్శించారు. అందాల పోటీలను కామాంధుల చేతికి కట్టబెట్టారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. ఆలేరు సభలో సీఎం అబద్ధాలు మాట్లాడారని అన్నారు. కేసీఆర్ 2015లోనే వైటీడీఏను ఏర్పాటు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ అంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎందుకు భయమని ప్రశ్నించారు. సభ జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేశారని అన్నారు.

Next Story