కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టం తీసుకొస్తే సంపూర్ణంగా మద్దతిస్తాం: బీఆర్ఎస్ ప్రకటన

by Gantepaka Srikanth |

అభయహస్తం డిక్లరేషన్‌(Abhayahastam Declaration)లో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు చేయాలని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టం తీసుకొస్తే సంపూర్ణంగా మద్దతిస్తాం: బీఆర్ఎస్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అభయహస్తం డిక్లరేషన్‌(Abhayahastam Declaration)లో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు చేయాలని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక డిక్లరేషన్‌ను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఈ సంగతే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) బృందం సభ్యులు కలిశారు. తాము ఎదుర్కుంటున్న సమస్యలను చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కాని అందులో ఏ ఒక్క దాన్ని అమలుచేయడం లేదన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, గిగ్ వర్కర్స్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్స్(Gig Workers) సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, బీమాతో కూడిన సామాజిక భద్రత, సరైన వేతనాలతో పాటు మరణించిన కార్మికులకు పరిహారం చెల్లింపును వెంటనే అమలుచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ హామీల అమలు బాధ్యతను తీసుకుంటానన్న రాహుల్ గాంధీ, వీరి సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్లైన అహ్మద్ బిన్ అబ్దుల్ ఖుదర్, శ్యామ్ సుందర్, లొకుర్తి నరేష్‌లకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ప్రమాద బీమా పరిహారం ఇప్పటికీ అందలేదన్నారు. వీరి కుటుంబాలు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ పరిహారం అందలేదన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలు అందించిన గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరణించిన గిగ్ వర్కర్స్ కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల పరిహారాన్ని చెల్లించడంతో పాటు గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఇంతేకాదు గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కేవలం ఓట్ల కోసం హామీలు ఇచ్చి విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని, కాంగ్రెస్‌కు చిత్తశుద్ధితో ఉంటే గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గిగ్ కార్మికుల సంక్షేమాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, వారి భద్రత, గౌరవం, హక్కులను కాపాడటం ప్రభుత్వ నైతిక, రాజకీయ బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Next Story