బీజేపీ‌కి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదు: MLA దాస్యం

by Disha Web Desk 12 |
బీజేపీ‌కి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదు: MLA దాస్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్‌లో బీజేపీ రాజకీయ నిరుద్యోగుల మార్చ్.. అబద్దాల మార్చ్ అని ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని.. తెలంగాణలో నిరుద్యోగుల మార్చ్ చేసే అర్హత లేదన్నారు. నిరుద్యోగ మార్చ్ చేస్తే ఢిల్లీలో చేయాలని, మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాటి గురించి బీజేపీ మోడీని నిలదీయాలని సూచించారు. పేపర్ లీకు వీరులు నిరుద్యోగ మార్చ్ చేయడం హాస్యాస్పదం అన్నారు. ఆ మార్చ్‌లో నిరుద్యోగులు లేరు.. అడ్డ మీద కూలీలే ఉన్నారని ఆరోపించారు. నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన వసతులతో పరీక్షలకు సిద్ధమవుతున్నారని, రోడ్ల మీదకు ఎవ్వరూ నిరుద్యోగులు లేరన్నారు. లక్ష 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. వివిధ దశల్లో మిగతా ఉద్యోగాల భర్తీ సాగుతోందన్నారు.

దొంగే దొంగ అన్నట్లు బీజేపీ తీరు ఉందన్నారు. పదో తరగతి పేపర్ల లీకేజీ కుట్ర దారు అని వాట్సాప్ చాట్ లతో రుజువైందని, బీఆర్ఎస్‌ది గాంధీ సిద్ధాంతం బీజేపీ ది గాడ్సే సిద్ధాంతమని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ చిచ్చు పెట్టాలనుకుంటోందని, అంబేద్కర్ ఆలోచన విధానాల కనుగుణంగా విద్య, వైద్య రంగాలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కేసీఆర్‌ను గద్దె దిగాలనడానికి బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, ఎందుకు కేసీఆర్ గద్దె దిగాలి? రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు కేసీఆర్ గద్దె దిగాలా.. ఏదైనా ప్రశ్నించాలనుకుంటే ఢిల్లీలో ప్రశ్నించాలన్నారు. విభజన చట్టం అమలుకు ఢిల్లీలో బీజేపీ ధర్నా చేయాలి. మేము కూడా మద్దతు ఇస్తాం అన్నారు.125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరకు బీజేపీ నేతలు రండి.. అభివృద్ధి పై చర్చిద్దాం సవాల్ చేశారు.

కేంద్రం చేసిన అభివృద్ధి ఏమిటో రాష్ట్రం చేసిందేమిటో తేల్చుకుందాం అన్నారు. మతం కులం ఆధారంగా బీజేపీ ప్రజలను విడగొడుతోందని.. ఆ కుట్రలను బీఆర్ఎస్ తిప్పి కొడుతుందన్నారు. కుటుంబ పాలన తెలంగాణలో అమలు కావడం లేదు.. కేసీఆర్ కుటుంబం కాదు తెలంగాణ కుటుంబ పాలన తెలంగాణలో అమలవుతోందన్నారు. మాట్లాడితే కేసీఆర్ కుటుంబం గురించి తప్ప బీజేపీ దగ్గర సబ్జెక్టు లేదన్నారు. దమ్ముంటే తెలంగాణ కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ సంక్షేమం అమలు చేయండి అని సూచించారు. కేసీఆర్ ముందు బీజేపీ కుప్పి గంతులు నడవవు అన్నారు. దేశం కేసీఆర్ వైపు వస్తోంది. ఢిల్లీలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు దమ్ముంటే తెలంగాణకు ఐటీఐఆర్ తేవాలి.. బుద్ధి తెచ్చుకుని బీజేపీ నేతలు ప్రవర్తించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పోరేషన్ చైర్మన్ కె. వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed