ఆ నలుగురు టాలీవుడ్ అగ్ర హీరోలకు బీజేపీ గాలం.. తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా భారీ స్కెచ్?

by Disha Web Desk 4 |
ఆ నలుగురు టాలీవుడ్ అగ్ర హీరోలకు బీజేపీ గాలం.. తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా భారీ స్కెచ్?
X

దిశ, వెబ్‌డెస్క్: కమలం పార్టీ నేతలు సినిమా గ్లామర్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారా..? వాళ్ల గ్లామర్‌ను ఎలాగైనా వాడుకుని తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా? తెలంగాణలో అధికారం.. ఏపీలో చక్రం తిప్పడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీలో ఇప్పటికే జనసేన పార్టీ చీఫ్‌ పవన్ కల్యాణ్‌కు బీజేపీ టాప్ ప్రిఫరెన్స్ ఇస్తోంది. జనసేనకు ఒంటరిగా అధికారంలోకి వచ్చే సత్తా లేకున్నా.. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి ఉందని గత ఎన్నికల్లో ప్రూవ్ అయిన నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్‌ను బీజేపీ కీలకంగా భావిస్తోంది.

అందుకే అమిత్ షా ప్రత్యేకంగా కలిసారా..?

అయితే తాజాగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌ను ఆయన నివాసంలో కలిసారు. అయితే ఇది కేవలం సినిమాకు ఆస్కార్ అవార్డు నేపథ్యంలో మాత్రమే జరిగిన మీటింగ్ కాదని ఇందులో కూడా బీజేపీ ఫార్ములా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, రామ్ చరణ్‌లకు వీపరితమైన క్రేజ్ ఉంది. దీన్ని ఎలాగైనా ఈ సారి ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది.

గతంలో ప్రజారాజ్యం పార్టీ నడిపిన చిరంజీవికి ఇప్పటికి ఏపీలో కొంత ఓటు బ్యాంకు ఉంది. వీరంతా జనసేనకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఏపీలో ఈ దఫా పొత్తులో బీజేపీ కీ రోల్ పోషించాలని భావిస్తోంది. అందుకే అమిత్ షా ప్రత్యేకంగా వీరిని ఇంటికి పిలిచి మరి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. వీరికి ప్రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా వారి ఫ్యాన్స్‌ను జనసేన, బీజేపీ వైపునకు తిప్పాలనేది బీజేపీ టార్గెట్‌గా తెలుస్తోంది. ఇటీవల మరణించిన కృష్ణంరాజు బీజేపీ పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా రిలీజ్ అనంతరం ప్రభాస్ సైతం ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ కలయికల వెనుక పొలిటికల్ టచ్ ఉందనే చర్చ జోరందుకుంది.

గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను సైతం..

అయితే గతంలో హైదరాబాద్‌కు వచ్చిన సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా ప్రత్యేకంగా కలిసారు. ఆ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్‌తో దేశమంతా బీజేపీ ప్రచారం చేయిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ కోణం లేకుండా బీజేపీ కేంద్ర పెద్దలు తెలుగు సినిమా అగ్ర హీరోలతో వరుస మీటింగ్‌లు ఎందుకు పెడతారనే చర్చ సాగుతోంది. ఏ అంశాన్ని అయినా రాజకీయంగా వాడుకునే బీజేపీ సినిమా గ్లామర్‌ను సైతం తమ వైపునకు తిప్పుకునేందుకే ఈ తాజా కలయికలని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. తెలంగాణలో సైతం చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు ఓ రేంజ్‌లో ఫ్యాన్ బేస్ ఉంది.

వీరికి రెడ్ కార్పెట్ వేయడం ద్వారా రెండు రాష్ట్రాల్లో వారి అభిమానులను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల సీఎంలు ఇవ్వనంత ప్రిఫరెన్స్ కేంద్రంలోని బీజేపీ ఇస్తున్నట్లు సమాచారం. బీజేపీ గతేడాది కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవికి సైతం బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు గతంలో క్లారిటీ ఇచ్చారు. మరి తాజాగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి. బీజేపీ స్టార్ హీరోలకు తమ పార్టీ కండువా ఏమైనా కప్పుతుందా అనేది మాత్రం తేలాల్సి ఉంది.


Next Story

Most Viewed