బీఆర్ఎస్ సభ@ఔరంగాబాద్.. భారీ మీటింగ్ కోసం బిగ్ ప్లాన్

by Dishanational2 |
బీఆర్ఎస్ సభ@ఔరంగాబాద్.. భారీ మీటింగ్ కోసం బిగ్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని డిసైడైన బీఆర్ఎస్, అక్కడ మరో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. నాందేడ్, కందార్ సభలు ఇప్పటికే సక్సెస్ కాగా, మూడో సభ కోసం ఔరంగాబాద్ ను ఎంచుకున్నట్లు తెలిసింది. సభ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆ రాష్ట్ర నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ హింట్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో భారీ జన సమీకరణకు గులాబీ నేతలు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే సభ నిర్వహణకు ఇంకా తేదీ ఖరారు కానట్లు తెలిసింది. తెలంగాణలో అనుసరించిన స్ట్రాటజీనే మహారాష్ట్రలో సైతం ఫాలో కావాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్..

టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలుత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల బరిలోకి దిగి సత్తా చాటింది. అందుకోసమే మహారాష్ట్రలో సైతం తొలుత స్థానిక సంస్థల్లో పోటీ చేసి సత్తాచాటాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. పలు మున్సిపల్, కార్పొరేషన్లతో పాటు జడ్పీలను కైవసం చేసుకొని అదే జోరును అసెంబ్లీ, పార్లమెంట్ లోనూ కొనసాగేలా ప్రణాళికలను చేపడుతున్నట్లు తెలిసింది. అందుకోసం కేసీఆర్ పూర్తిస్థాయి ఫోకస్ ను మహారాష్ట్ర పైనే పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది.

గులాబీ గూటికి పలువురు నేతలు..

ప్రస్తుతం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే బీఆర్ఎస్ లో చేరికలను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ముందుగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. నాందేడ్, ఠానే, అహ్మద్ నగర్, శిర్డీ, బ్రుహాన్ ముంబైలాంటి కార్పొరేషన్లతోపాటు పలు మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నారు. జడ్పీలను సైతం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే బీడ్ మున్సిపల్ మేయర్ గా పనిచేసిన దిలీప్ గోరే, ఔరంగబాద్ సెంట్రల్ నియోజకవర్గంలో పట్టున్న నేత, ఎన్సీపీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా, మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ నేతలు, చంద్రపూర్ జిల్లాకు చెందిన యువజన నేతలు, ఔరంగాబాద్, పర్బనీ జిల్లాల్లో పట్టువున్న సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందిన యువనేత అభయ్ కైలాస్ ఇలా పలు పార్టీలకు చెందిన నేతలు గులాబీ గూటికి చేరారు.

సుమారు 15మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ లో చేరినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు మహారాష్ట్రలో పార్టీ విస్తరణలో భాగంగా బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా మాణిక్‌ కదమ్‌ను సైతం నియమించి, కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.


Next Story