‘‘పరువు తీశారుకదరా నీచుల్లారా’’.. తానా సభల్లో తన్నులాటపై బండ్ల గణేష్ ఫైర్

by Disha Web Desk 19 |
‘‘పరువు తీశారుకదరా నీచుల్లారా’’.. తానా సభల్లో తన్నులాటపై బండ్ల గణేష్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) 23వ మహాసభల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ రచ్చ రేపింది. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జూలై 7, 8, 9 తేదీల్లో జరిగిన ఈ సభల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ సభలో పలువురు పరస్పరం కొట్టుకోవడం దుమారం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో ఈ గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. జై ఎన్టీఆర్ నినాదం తీసుకురావడంతోనే లోకేష్ అభిమానులు గొడవకు దిగారని, ఈ క్రమంలో తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం కొట్టుకున్నాయని పోస్టు చేసింది. పిడిగుద్దులు గుద్దుకుంటూ రచ్చ చేశారని రాసుకొచ్చింది.

ఇదిలా ఉంటే ఈ గొడవకు సంబంధించిన వీడియోలపై బండ్ల గణేష్ సైతం స్పందించారు. 'తానా పరువు తీస్తున్నారు కదా. దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఈ సభలకు వచ్చిన వారు తమకు భోజనం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ సమావేశాలకు తెలుగు స్టేట్స్ నుండి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీతక్క పలువురు హాజరయ్యారు.

Next Story