‘తెలంగాణలో ఉద్యోగులు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’

by Disha Web Desk 2 |
‘తెలంగాణలో ఉద్యోగులు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆర్టిజన్లు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారని, దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గర్హనీయమని ధ్వజమెత్తారు. విద్యుత్‌ శాఖ యాజమాన్యం కూడా పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. రాష్ట్ర సర్కార్‌ కనీసం శ్రద్ధ చూపకపోవడం ఉద్యోగులపై ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. జీపీఎఫ్‌, పీఆర్‌సీ వంటి సమస్యల పరిష్కారంలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 1999 నుంచి 2004 మధ్య కాలంలో విద్యుత్‌ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని బండి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారిపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఆర్టిజన్లు, విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెలోకి దిగితే రాష్ట్ర పాలనా యంత్రాంగమే కుప్పకూలుతుందని సంజయ్ హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. కొత్త పీఆర్‌సీ గురించి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. దేశంలోనే మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొనే కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులు కోరుతున్న నగదు రహిత మెడికల్‌ పాలసీకి ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. పదవీ విరమణ సహా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌లు, పీఆర్‌సీ, జీపీఎఫ్‌ వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఆర్టిజన్లతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే 15 రోజుల్లోనే తెలంగాణ ఉద్యోగులు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని బండి సంజయ్ హెచ్చరించారు.

Next Story

Most Viewed