TSPSC పేపర్ లీకేజీలో కేటీఆర్‌తో పాటు సీఎంవో కుట్ర: బండి సంజయ్

by Disha Web Desk 19 |
TSPSC పేపర్ లీకేజీలో కేటీఆర్‌తో పాటు సీఎంవో కుట్ర: బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించే తీరిక లేదా అని ధ్వజమెత్తారు. దళిత నియోజకవర్గాల పట్ల కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగిన పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ బిడ్డను కాపాడేందుకు మంత్రి వర్గం మొత్తం ఢిల్లీకి వెళ్లిందని మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీ లీకేజీలో కేసీఆర్ కొడుకుతో పాటు సీఎంవోలో పనిచేసే ఓ రిటైర్డ్ అధికారి పాత్ర ఉందని ఆరోపించారు. ఈ కుట్రలో పెద్ద తలకాయల పాత్ర ఉందని వారిని తప్పించేందుకు కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

చర్చను దారి మళ్లించేందుకే బీజేపీని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను దళిత మోర్చా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిదని దీనికి బాధ్యతగా కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 'మా నౌకర్లు మాక్కావాలే' అనే నినాదంతో రేపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యం అవుతుందని కేసీఆర్ పొగిడిన శ్రీలంక, చైనా, పాకిస్థాన్ దేశాల పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.


Next Story

Most Viewed