ముందస్తుకు కాంగ్రెస్ సిద్ధం.. ఈ వారమే సునీల్ రిపోర్టు?

by Disha Web Desk 2 |
ముందస్తుకు కాంగ్రెస్ సిద్ధం.. ఈ వారమే సునీల్ రిపోర్టు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నియమించుకున్న వ్యూహకర్త సునీల్ కుమార్ ఈ వారంలోనే నివేదికను ఏఐసీసీకి సమర్పించనున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పవనే అంచనాతో సునీల్ కుమార్ కూడా తనకు అప్పగించిన బాధ్యతలను వేగంగా పూర్తి చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌తోనూ త్వరలో భేటీ అయ్యి రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న అంశాలను తన నివేదికలో పొందుపర్చనున్నారు. పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు, మెరుగుపర్చుకునేందుకు తీసుకోవాల్సిన అంశాలపైనా తన సిఫారసులను పేర్కొననున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. మరే రాష్ట్రంలో లేనంత భారీ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు అయినందున సరికొత్త ఫార్ములాను కూడా సూచించనున్నట్లు తెలిసింది.

రాష్ట్రంలో సుమారు 40 లక్షల సభ్యత్వం పూర్తయినందున ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరొకరితో అనుకూలంగా ఓటు వేయించడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం సులభం అనే అభిప్రాయం పార్టీలో నెలకొన్నది. దీన్ని కూడా సునీల్ కుమార్ తన నివేదికలో 'వన్ ప్లస్ వన్' అని నొక్కిచెప్పనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నదంటూ కాంగ్రెస్ బలంగా నమ్ముతున్నందున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రంగంలోకి దిగడానికి ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందుకోసం సునీల్ కుమార్ ఇచ్చే నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి, దానికి దారితీసిన కారణాలు, అది కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడనున్నది తదితర అంశాలన్నింటినీ సునీల్ కుమార్ తన నివేదికలో నియోజకవర్గాల వారీగా వెల్లడించనున్నారు. అధికార పార్టీ పట్ల ఏ సెక్షన్ ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నది, కాంగ్రెస్‌‌ను ఏ మేరకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు, బీజేపీకి అనుకూలంగా ఉండే పరిస్థితులేంటో కూడా ఈ నివేదికలో తేటతెల్లం కానున్నది. ఏ సెక్షన్ ప్రజలను దగ్గర చేసుకోవడం ద్వారా ఓటు బ్యాంకు ఏ మేరకు పెంచుకోవచ్చు, వారిని ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ఎలాంటి హామీలను ఇవ్వవచ్చు.. ఇలాంటి అంశాలన్నింటిపై రానున్న కాలంలో ఫోకస్ పెట్టనున్నది.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అవలంబించాల్సిన ఎత్తుగడలను కూడా సునీల్ కుమార్ తన నివేదికలో పొందుపరచనున్నారు. ఏ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి అభ్యర్థిని కోరుకుంటున్నారు, ఆ అభ్యర్థి నుంచి లేదా పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు, వారి ఆకాంక్షలేంటి, ప్రస్తుతం సిట్టింగ్‌ల పట్ల ఏయే అంశాల్లో అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశాలన్నింటిపైనా లోతైన అధ్యయనం ఈ నివేదికలో ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నది. వాటి ఆధారంగానే టికెట్ల కేటాయింపు మొదలు గెలుపు వ్యూహాన్ని ఖరారు చేయడం వరకు కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోనున్నది. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించడంతో కాంగ్రెస్ కూడా ఎక్కడా వెనకబడకూడదనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నది.

Next Story