బస్ భవన్‌ను స్వాధీనం చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ.. ఏ బ్లాక్‌కు తాళాలు

by Ramesh Naini |   (  Updated:2026-04-04 16:35:26  IST  )

ఇటీవల బస్ భవన్ లో ఏ బ్లాక్ ను కైవసం చేసుకుని తమ కార్యాలయాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఐటీ, జీఎస్టీ అధికారులు తిరిగి వెళ్లిపోయారు.

బస్ భవన్‌ను స్వాధీనం చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ.. ఏ బ్లాక్‌కు తాళాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల బస్ భవన్‌లో ఏ బ్లాక్‌ను కైవసం చేసుకుని తమ కార్యాలయాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఐటీ, జీఎస్టీ అధికారులు తిరిగి వెళ్లిపోయారు. శనివారం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వచ్చి ఐటీ, జీఎస్టీ అధికారులను బస్ భవన్ నుంచి పంపించి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. బస్ భవన్ ఏ బ్లాక్ లోని 4 అంతస్తులను తెలంగాణ సీఎస్ ఆదేశాల మేరకు జీఎస్టీ, ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం... తెలంగాణ సీఎస్‌కు లేఖ రాసింది. తిరిగి బస్ భవన్‌లోని ఏ బ్లాక్ ను ఎప్పటిలా ఏపీఎస్ఆర్టీసీకి ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో శనివారం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు బస్ భవన్ చేరుకుని ఏ బ్లాక్ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అన్ని ఫ్లోర్లలోనూ కార్యాలయాలకు తాళాలు వేసుకుని తమ సెక్యూరిటీ సిబ్బందిని రక్షణగా పెట్టారు. అనుమతి లేకుండా తమ కార్యాలయం వద్దకు ఇతరులకు ప్రవేశం లేదని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

బస్ భవన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, జీఎస్టీ కార్యాలయాలకు కేటాయించడంపైన టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని తెగే వరకు లాగకపోవడం గమనార్హం. బస్ భవన్ నుంచి ఐటీ, జీఎస్టీ అధికారులు తిరిగి వెళ్లిపోవడంతో ఈ అంశంపై తాము చేపట్టిన ఆందోళనను విరమించుకుంటున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ తిరిగి తమ భవనాన్ని కైవసం చేసుకునేందుకు సహకరించినందుకు తెలంగాణ కార్మిక సంఘాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

Next Story