కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, వైసీపీ మధ్య రాజకీయం హీటెక్కింది. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలతో మరోసారి ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. తాజాగా హరీష్ రావుపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు తన మామ కేసీఆర్‌తో కలిసి ఫామ్ హౌస్‌లో కల్లు తాగాడేమో అని అనిపిస్తోందని, కల్లు తాగిన కోతిలాగా ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ లో కూర్చుని కల్లు తాగేవారు ఏపీలో లేరన్నారు. కవితక్క లాగా అలాంటి చాటింగ్‌లు తమ వద్ద లేవని ఎద్దేవా చేశారు.

మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే దానికి బిడ్డింగ్ వేస్తామని సిగ్గులేకుండా చెబుతున్నారని బీఆర్ఎస్ ప్రైవేటీకరణకు అనుకూలమా వ్యతిరేకమో చెప్పాలని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెప్పి దొరల పాలన సాగిస్తున్నారని తెలంగాణ మీ జాగిరా అని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మీరంతా ప్రాంతీయ ఉగ్రవాదులు అని ఆరోపించారు.

మా ఆంధ్ర వాళ్లు తెలంగాణకు రావడం మానేస్తే అక్కడ అడుక్కోవడం తప్ప ఏమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ బిడ్డింగ్ వరకు వెళ్లకూడదని తాము అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ వేస్తామని చెబుతోందని ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలు బిడ్డింగ్ వేస్తాయా అని ప్రశ్నించారు. అంతకు ముందు ఏపీ మంత్రుల వ్యాఖ్యలకు హరీష్ రావు సైతం అంతే ధీటుగా బదులివ్వడం ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం ఆసక్తిని రేపుతోంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంటోంది. ఇటీవల చోటు చేసుకున్న టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారాన్ని కార్నర్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతుంటే అప్పల రాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది అప్పలరాజు అసలు బాగోతం అంటూ ఆయన్ను విమర్శిస్తూ వీడియోలు, పోస్టులు షేర్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సోషల్ వార్ షురూ అయింది.

Next Story

Most Viewed