జాతీయ అధ్యక్షుడు లేకుండానే ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్!

by Disha Web Desk 2 |
జాతీయ అధ్యక్షుడు లేకుండానే ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం ఆదివారం ప్రారంభం అయింది. గుంటూరు మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వేషన్ సెంటర్ వద్ద ఐదంతస్థుల భవనంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమాని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ తో సహా తెలంగాణకు చెందిన నేతలెవరూ ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కొత్త ఆఫీసులు ప్రారంభమయ్యాయి. వీటిలో చాలా వరకు స్వయంగా సీఎం కేసీఆరే ప్రారంభించారు.

ఆ సందర్భంలో బహిరంగ సభలను ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలపై సంచలన ప్రకటనలు చేశారు. అలాంటిది ఓ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి అధినేత కేసీఆర్ దూరంగా ఉంటడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. నిజానికి బీఅర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న గులాబీ బాస్ రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని వివిధ రాష్ట్రాల్లో బలోపేతం చేయాలని ప్రణాళికలతో ఉన్నారు. ఇందులో భాగంగా ఏపీ, మహారాష్ట్ర, యూపీ, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రమైన ఏపీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తుంటే కేసీఆర్ మాత్రం ఆ కార్యక్రమానికి దురంగా ఉండటం వెనుక అసలు మతలబు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఉద్యమ సమయంతో పాటు రాష్ట్ర అవతరణ అనంతరం ఏపీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆయన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లలేదని ఒక వేళ వెళ్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనే సందేహంతోనే ఆయన ఏపీలో అడుగు పెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై బీఆర్ఎస్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

Also Read...

బ్రేకింగ్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ



Next Story

Most Viewed