లిక్కర్ స్కాం కేసు దర్యాప్తుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
లిక్కర్ స్కాం కేసు దర్యాప్తుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత మనీష్ సిసోడియాతో పాటు ఇతర కేసుల్లో పలువురు ప్రతిపక్ష నేతలపై ఏజెన్సీలు విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. రెండు కేసులు మినహా ఎజెన్సీలు దర్యాప్తు చేస్తున్న కేసులన్నీ యూపీఏ ప్రభుత్వం హయాంలో నమోదైనవేనని అన్నారు.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొని మాట్లాడిన అమిత్ షా దర్యాప్తు సంస్థలు కోర్టుకు అతీతం కాదని తెలిపారు. నోటీసులు, ఎఫ్‌ఐఆర్‌లు, చార్జ్‌షీటులను కోర్టుల్లో సవాలు చేయవచ్చని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేసే బదులు ఏజెన్సీలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు తమ వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే కోర్టులో సమర్పించవచ్చని సూచించారు. అదానీ గ్రూప్‌పై విచారణ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఇందులో ఎవరి తప్పు తేలినా విడిచిపెట్టకూడదని అన్నారు.

న్యాయ వ్యవస్థపై అందరికీ నమ్మకం ఉండాలని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినట్లు ఆరోపణలు వస్తే పరిస్థితిని ప్రశాంతంగా ఉంచేందుకు నాటి ప్రభుత్వం సీబీఐ ద్వారా కేసు నమోదు చేసిన విషయాన్ని షా గుర్తు చేశారు. ఏజెన్సీలను అడ్డు పెట్టుకుని కేంద్రం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందన్న ఆరోపణలను అమిత్ షా ఖండించారు. వారి పార్టీల్లో నిపుణులైన లాయర్లు ఉన్నారు. తప్పు జరిగితే కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. నిరాధార ఆరోపణలు ఎక్కువ కాలం ప్రజలు నమ్మరని అన్నారు.


Next Story