బిగ్ న్యూస్: RRR టీమ్‌తో అమిత్ షా భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా కేంద్రమంత్రి టూర్!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: RRR టీమ్‌తో అమిత్ షా భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా కేంద్రమంత్రి టూర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్సయింది. ఈనెల 23వ తేదీన తెలంగాణకు రానున్న ఆయన ట్రిపుల్ ఆర్ మూవీ టీమ్‌తో భేటీ కానున్నారు. ఇటీవల ఆస్కార్ అందుకున్న ట్రిపుల్ ఆర్ బృందాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా సన్మానించనున్నారు. ఈ బృందంలోని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌ను అమిత్ షా సన్మానించనున్నారు.

ఇదిలా ఉండగా కశ్మీర్ ఫైల్స్ తరహాలో రజాకార్ ఫైల్స్ తీయాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సినిమా తెరకెక్కుతుండగా.. విజయేంద్ర ప్రసాద్‌ను సైతం కథ సిద్ధం చేయాలని బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం. ఈ భేటీలో విజయేంద్ర ప్రసాద్‌తో రజాకర్ ఫైల్స్ కథ ఎంత వరకు పూర్తయిందనే అంశాలపై అమిత్ షా చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిపై పట్టు పెంచుకునేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై పూర్తిగా దృష్టిసారిస్తోంది.

అందులో భాగంగానే రజాకర్ ఫైల్స్ తీయనుంది. ఇదిలా ఉండగా గతేడాది ఆగస్టు 22వ తేదీన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా గతేడాది ఆగస్టు 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సినీ నటుడు నితిన్, టీమిండియా మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తోనూ భేటీ అయ్యారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ టీమ్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా వరుసగా సెలబ్రెటీలను భేటీ కావడం వెనుక ఆంతర్యమేంటని తెలియాల్సి ఉంది.

అమిత్ షా షెడ్యూల్ ఇదే..

పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్లలో నిర్వహిస్తున్న సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు చేవెళ్లలో బీజేపీ ‘విజయ సంకల్ప సభ’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం మూడున్నరకు శంషాబాద్​ విమానాశ్రయానికి షా చేరుకుంటారు. 3.50 గంటలకు శంషాబాద్​నోవాటెల్‌కు ఆయన చేరుకుంటారు.

సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు ట్రిపుల్​ఆర్​టీంతో షా భేటీ కానున్నారు. 4:30 నుంచి 5:10 వరకు బీజేపీ నేతలతో కోర్​కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగనుంది. ఆపై 5:15 గంటలకు అమిత్ షా చేవెళ్లకు బయలుదేరనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు పబ్లిక్​మీటింగ్‌లో పాల్గొననున్నారు. ముగిశాక 7 గంటలకు శంషాబాద్‌కు బయలుదేరి 7:45కు శంషాబాద్ ఎయిర్​ పోర్ట్‌కు చేరుకుంటారు. 7:50 గంటలకు ఢిల్లీకి అమిత్ షా తిరుగునపయనం కానున్నారు.

Also Read...

పొలిటికల్ ఎంట్రీపై సాయిధరమ్ తేజ్ క్లారిటీ



Next Story

Most Viewed