- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
All party meeting: ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కు బీజేపీ, బీఆర్ఎస్ దూరం.. ట్విస్ట్ ఇచ్చిన ఎంఐఎం

దిశ, డైనమిక్ బ్యూరో/తెలంగాణ బ్యూరో : ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (All Party MPs Meeting) నేతృత్వంలో మీటింగ్ నిర్వహిస్తున్నారు. సమావేశానికి రావాలని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే సమావేశానికి బీఆర్ఎస్(BRS), బీజేపీ (BJP) దూరంగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతోపాటు ఎంఐఎం (MIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో భట్టి విక్రమార్క సమావేశం నిర్వహిస్తున్నారు.
మా ఎంపీలు ఇవాళ బిజీ బిజీ...
అఖిలపక్ష భేటీకి హాజరు కాకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ సమావేశానికి రావడం లేదని భట్టికి కిషన్రెడ్డి (Kishan Reddy) ఇవాళ లేఖ రాశారు. ‘మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. ప్రాధాన్యత కలిగిన ఇలాంటి సమావేశాల్లో కీలకమైన అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కనీస సమయం అవసరమనే విషయం మీకు తెలిసిందే. కానీ బీజేపీ ఎంపీలందరికీ నిన్న రాత్రి ఆలస్యంగా ఈ సమాచారం అందింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా మా ఎంపీలందరికీ వారి వారి నియోజకవర్గాల్లో ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతోపాటు ముందుగా నిర్ణయించిన అధికార, అనధికార కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి మేం హాజరుకాలేకపోతున్నాం. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే కాస్త ముందుగానే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాం. ’ అని లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు ఉన్నా..
అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజరు అయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పార్థసారథి, దామోదర్రావు, కేతిరెడ్డి సురేశ్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరికి కూడా ఆహ్వానం వెళ్లనప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.






