వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులకు అలర్ట్.. తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు జారీ

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన వినాయక చవిత ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.

వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులకు అలర్ట్.. తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన వినాయక చవిత ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. నడిరోడ్డుపై వినాయక మండపాన్ని ఏర్పాటు చేయగా.. చర్యలు తీసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదంటూ సికింద్రాబాద్‌‌కు చెందిన ప్రభావతి అనే వృద్ధురాలు, మరో గర్భిణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్‌కుమార్‌ సింగిల్ బెంచ్ వినాయక చవితి ఉత్సవాలపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. గణేశ్ మండపాల ఏర్పాటుతో సాధారణ ప్రజలతో పాటు గర్భిణులు, వృద్ధులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. నవరాత్రుల్లో ప్రజల నుంచి ఫిర్యాదులకు ప్రతి పోలీసు స్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు.

అదేవిధంగా కమ్యూనిటీ గ్రౌండ్స్, ఖాళీ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మండపాల ఏర్పాటుకు పోలీసులు, మున్సిపల్‌ అధికారుల అనుమతులు తీసుకోవాలని తప్పనిసరి అని అన్నారు. ట్రాఫిక్‌, ఆసుపత్రులు, అంబులెన్స్, ఫైరింజన్‌ల రాకపోకలకు అడ్డంకిగా మండపాలు ఉండకూడదని తెలిపారు. మండపాలకు తీసుకునే విద్యుత్తు కనెక్షన్లు సురక్షితంగా ఉండాలే నిర్వహాకులు చూసుకోవాలన్నారు. శబ్ధ పరిమితికి మించి మైక్‌లు ఏర్పాటు చేయకూడదని, సౌండ్‌ సిస్టమ్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుతించాలని పోలీసులను ఆదేశించారు. మితిమీరిన శబ్దం, న్యూసెన్స్‌ చేసిన వారిపై ఫిర్యాదులు వస్తే తక్షణమే యాక్షన్ తీసుకోవాలని అన్నారు. విగ్రహాల నిమజ్జనం, ఊరేగింపులకు సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని సింగిల్ బెంచ్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

Next Story