తెలంగాణలో టీడీపీ భారీ వ్యూహం.. టార్గెట్‌ను ఛేదించేలా యాక్షన్ ప్లాన్?

by Disha Web Desk |
TDP Announces Candidates for MLC Elections
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీడీపీ బలోపేతంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ నేతల్లో భరోసా నింపుతున్నారు. ఇంటింటికీ టీడీపీ వ్యూహంతోనే ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. అన్ని డివిజన్లలో సభలకు కసరత్తు చేస్తుంది. నియోజకవర్గాల్లోనూ సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి సెగ్మెంట్లలో 35వేల సభ్యత్వాలను చేయాలని ప్రణాళికలు రూపొందించింది. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించే ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దశాబ్దకాలంగా స్తబ్దత నెలకొంది. పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు కార్యకర్తలు సైతం టీఆర్ఎస్‌తో పాటు పలుపార్టీల్లో చేరారు. దీంతో నడిపించే నాయకుడు లేకపోవడంతో ఉన్న కిందిస్థాయి కేడర్ లో సైతం నైరాశ్యం నెలకొంది. అయితే తిరిగిపార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తెచ్చేందుకు ప్రణాళికలను రూపొందించారు. అందులో భాగంగానే కాసాని జ్ఞానేశ్వర్‌కు రాష్ట్రపార్టీ బాధ్యతలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అప్పగించారు. దీంతో ఈ నెల 21 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ స్థితిగతులతో పాటు బలోపేతంపై సమీక్షిస్తున్నారు. ఇతరపార్టీల్లోని నేతలపై ఫోకస్ పెట్టాలని వచ్చే నేతలకు ఆఫర్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నేతలతో సమావేశాలు, డివిజన్లలో సభలకు కసరత్తు చేస్తున్నారు. ప్రతికార్యకర్తను కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి, 35వేల సభ్యత్వాలను నమోదు చేసేలా కసరత్తు చేస్తున్నారు. కేడర్‌కు నేతలు దూరంగా ఉండటంతో నెలకొన్న నైరాశ్యంను పోగొట్టేందుకు వారితో భేటీ అయ్యేందుకు, వారికి పార్టీ అండగా ఉందని, గతాన్ని వదిలివేయాలని, ప్రస్తుతం చూడాలని అండగా ఉంటామనే భరోసాను ఇచ్చేలా కృషి చేస్తున్నారు.

'ఇంటింటికీ టీడీపీ' వ్యూహం...

ఇంటింటికీ టీడీపీ నినాదంతో గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకోసం 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమానికి రూపకల్పన చేశారు. త్వరలోనే ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని విస్తృతంగా వివరించేలా కార్యచరణ రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో చేసిన అభివృద్ధిని కరపత్రాలు ముద్రించి గ్రామాల్లో పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు. పార్టీ జెండాలతో ర్యాలీలు, జెండాదిమ్మెల వద్ద జెండావిష్కరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ప్రతికార్యకర్త టీడీపీ జెండా పట్టుకునేలా కలిసేలా ప్రణాళికలను ఇప్పటికే పార్టీ అధిష్టానం గ్రామస్థాయి నేతలకు ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ప్రయత్నాలను ఇప్పటికే షురూ చేశారు. హైదరాబాద్ టీడీపీ పాలనలో నిర్మించిన హైటెక్ సిటీ, ఓఆర్ఆర్ రూపకల్పన, ప్లైఓవర్, విదేశీ పెట్టుబడులు, చేసిన అభివృద్ధిని కరపత్రాల్లో పొందుపర్చి ముందుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

యాక్టీవ్‌గా పనిచేసే నేతలకే టికెట్లు?

పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్న నేతలతోపాటు యాక్టీవ్‌గా పనిచేసేవారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఇప్పటికే పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం, స్థానికంగా పార్టీని బలోపేతం చేసేవారి వివరాలను అధిష్టానం ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. వారి పనితీరును ఆధారంగానే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. పార్టీలో ఏళ్లతరబడి ఉన్నప్పటికీ పనిచేయకపోతే రాబోయే ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే తేల్చిచెప్పినట్లు సమాచారం.

త్వరలోనే పార్టీలో ఖాళీ స్థానాలు భర్తీ?

పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుంబంధ సంఘాల్లోనూ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్టీలో నేతలు ఉన్నప్పటికీ గత పార్టీ అధ్యక్షులు భర్తీచేయలేదు. ఆ ఖాళీల భర్తీపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే అన్నింటిని భర్తీ చేయడంతో నియోజకవర్గ, పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు బలహీనంగా ఉంటే వారిని కూడా మార్చే అవకాశం ఉంది. అందుకోసం నేతల నుంచి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. పార్టీ నేతల అభిప్రాయం మేరకు కొత్త అధ్యక్షులను నియమించనున్నట్లు తెలిసింది. పార్టీలో మాటలు చెప్పేవారికి సైతం చెక్ పెట్టే అవకాశం ఉంది.

టీడీపీకి పూర్వ వైభవం సాధ్యమేనా?

1982 మార్చి 29న స్వర్గీయ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే.. అంటే 1983 జనవరిలో తొలి సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొని.. ఆ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్నారు. మొత్తం 294 స్థానాలకుగానూ టీడీపీకి 203స్థానాలు రాగా.. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర సీఎంగా ఎన్టీ రామారావు చరిత్ర సృష్టించారు. 1984లో 202 అసెంబ్లీలో విజయం సాధించగా, 1994లో 216, 1999లో 180 అసెంబ్లీలో విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 7 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 4సార్లు విజయం సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తెలంగాణలో 2014 ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో, 2018 ఎన్నికల్లో 2 అసెంబ్లీలో విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో పార్టీకి ఉన్న వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యం

టీడీపీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డమీద. పార్టీకి గ్రామస్థాయిలో ఇంకా బలమైన కేడర్ ఉంది. నాయకత్వ లోపంతో స్తబ్దత ఏర్పడింది. దానిని తొలగించేలా కసరత్తు చేస్తున్నాం. అందులో గ్రామాల్లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని కరపత్రాల రూపంలో ప్రచారం చేస్తాం. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది టీడీపీయే. ప్రతి కార్యకర్తలో మనోదైర్యం నింపడంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పనిచేసేవారికే టికెట్లు ఇస్తామని వెల్లడించారు.

-కాసాని జ్ఞానేశ్వర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి :

కలిసికట్టుగా పనిచేద్దాం... టీడీపీకి పునర్ వైభవం తెద్దాం




Next Story

Most Viewed