‘మీ అవినీతి వల్లే కాళేశ్వరం కూలింది’.. ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-17 15:13:36  IST  )

కాశేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లకు కాంగ్రెస్​వాళ్లు బాంబులు పెట్టారంటూ బీఆర్ఎస్ ​నేతలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ ​ఆది శ్రీనివాస్​తిప్పికొట్టారు.

‘మీ అవినీతి వల్లే కాళేశ్వరం కూలింది’.. ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లకు కాంగ్రెస్​ వాళ్లు బాంబులు పెట్టారంటూ బీఆర్ఎస్ ​నేతలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ ​ఆది శ్రీనివాస్ ​తిప్పికొట్టారు. మీ బీఆర్ఎస్​ హయాంలోనే మేడిగడ్డ కూలిందన్న విషయం మీకు గుర్తు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆది శ్రీనివాస్​ మీడియాతో మాట్లాడుతూ.. కూలినప్పుడే పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారన్నారు. మీ అవినీతి అక్రమాల వల్లనే కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలా మారిందని ఆయన​ ధ్వజమెత్తారు.

కాళేశ్వరంపై బీఆర్ఎస్​ మాజీ మంత్రి హారీష్​రావు చేసిన ఆరోపణలపై ఆది శ్రీనివాస్​ స్పందించారు. కాళేశ్వరం పైన హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయవద్దని చెప్పిందన్నారు. కాళేశ్వరంలో నీళ్లు నింపడం, నీళ్లు వదలడం ఎప్పుడు ఏం చేయాలో సీఎం రేవంత్​ రెడ్డికి, ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ ​రెడ్డిలకు తెలుసన్నారు.

ముందు మీరు మీ పార్టీని చక్కదిద్దుకోండని హరీష్ ​రావుకి ఆది శ్రీనివాస్ ​హితవు పలికారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, కాళేశ్వరాన్ని కాళేశ్వరం చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ని అపర భగీరథుడు, నదులకు నడకలు నేర్పారని చెప్పుకున్న మీరు పీసీ ఘోష్​ కమిషన్ ముందు ఇంజనీరింగ్​ అధికారుల పై నెపం మోపింది నిజం కాదా అని ప్రశ్నించారు.

మేడిగడ్డ లో నీళ్ళు నిల్వ చేసి ఆ బ్యారేజ్ కొట్టుకుపోయి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని హరీష్ రావు మాట్లాడుతున్నారని, ‌‌మేం అన్ని ప్రాజెక్ట్ లు నింపుతాం, రైతులకు నీళ్లు ఇస్తామన్నారు. హరీష్ రావు బురద రాజకీయాలు మానుకోవాలన్నారు. కాళేశ్వరంలో నీళ్ల అంశంపై ఎన్డీఎస్ఏతో చెప్పించండి అని ఆది శ్రీనివాస్ ​సూచించారు.

Next Story