42 టేబుల్స్, 10 రౌండ్లు.. జూబ్లీహిల్స్ బై పోల్ కౌంటింగ్‌కు చకచక ఏర్పాట్లు

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌‌కు ఈసీ చకచక ఏర్పాట్లు చేపడుతోంది.

42 టేబుల్స్, 10 రౌండ్లు.. జూబ్లీహిల్స్ బై పోల్ కౌంటింగ్‌కు చకచక ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌‌కు ఈసీ చకచక ఏర్పాట్లు చేపడుతోంది. మంగళవారం పోలింగ్ పూర్తయిన తరువాత భారీ భద్రత నడుమ ఈవీఎంలను స్ర్టాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఈ నెల 14న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటల వరకు ముగిసే అవకాశం ఉంది. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉండగా మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో పూర్తి స్థాయి ఫలితాలు తేలనున్నాయి. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు కౌంటింగ్‌లో పాల్గొననున్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ర్టాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్‌ ప్రక్రియను స్టార్ట్ చేయనున్నారు.

ఈ ఎన్నికల్లో బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక్కటి కూడా రాలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకపోవడంతో ముందుగా హోం ఓటింగ్ ఓట్లు లెక్కించనున్నారు. మొత్తం హోం ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా ఇందులో 101 మంది ఓటు వేయగా ఇద్దరు మరణించారు. ఆ తరువాత ఈవీఎంలో ముందుగా షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాం అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఫలితాన్ని అప్‌లోడ్ చేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా.. అందులో పురుషులు 2,08,561, మహిళలు1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. మొత్తం 1,94,631 మంది తమ ఓటు హక్కును వినయోగించుకున్నారు. వారిలో 99,771 మంది పురుషులు కాగా, 94,855 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. నియోజవర్గంలో మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు.

Next Story