తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి

by  |
తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని, ‘‘మా ఇష్టమోచ్చినట్లు మేము చేస్తాం.. మేము చెప్పినట్లు మీరు చేయాలి’’ అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ పాలకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని, కృష్ణా నీటిలో మా వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే జలవిద్యుత్ కోసమని, జల విద్యుత్ ఉత్పత్తిని ఆపాలనే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. దొంగదారిలో, అక్రమ పద్దతిలో నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు ఉందని, తప్పకుండా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటామని, ఎవరో ఆర్డర్టు ఇస్తే వినాల్సిన అవసరం మాకు లేదని తేల్చిచెప్పారు.

మూడో వ్యక్తి జోక్యం లేకుండా ఇద్దరం కూర్చోని మాట్లాడుకుందామని మొదట ప్రతిపాదించింది తెలంగాణ సీఎం కేసీఆర్ అని, కానీ దానిని తీసుకోవడంలో ఏపీ సీఎం విజ్ఞత లోపించిందని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నంతసేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని, అలా చేయకుండా తెలంగాణను ఆపే శక్తి, ఆపే హక్కు ఎవరికీ లేదని గుర్తుచేశారు. ఇంకా పాతరోజులు కావని, తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రం అన్న విషయం ఏపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ ఎవరి చెప్పుచేతుల్లో లేదని, మీ బానిసలు అధికారంలో లేరని, ఒకప్పుడు మీ ప్రాంత వాసులను బానిసలుగా చేసుకొని ఆటలు సాగించారని, ఇప్పుడు మీ ఆటలు సాగబోవని వార్నింగ్ ఇచ్చారు. ‘ఇకనైనా మీ కుప్పిగంతలు ఆపండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు విషయంలో ముందు మీ అక్రమ నిర్మాణాలు మానేసి ముందుకు రండి. ఇరు రాష్ట్రాల రైతంగానికి లబ్ధి చేకూరేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచిస్తారు. మీ జేబులో మేము దోచుకుంటాం.. మా జేబుల వైపు చూడవద్దు అంటే ఇక్కడెవరూ అమాయకులు లేరు’ అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed