ఒక్క పాజిటివ్ కేసున్నా… కంటైన్మెంట్ జోన్ గా గుర్తింపు

by  |
ఒక్క పాజిటివ్ కేసున్నా… కంటైన్మెంట్ జోన్ గా గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తమై.. తగు చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నందున కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఏ ఒక్క ఇంట్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు బయటపడినా.. ఆ ఇంటి చుట్టూ ఉన్న 100 ఇళ్లతో కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి మొత్తం ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన మార్గనిర్దేశకాలు విడుదల చేసింది.

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్‌లుగా ఏర్పాటు చేసి అష్టదిగ్బందం చేస్తున్నారు. ఆ జోన్‌లోని అన్ని మార్గాలు, రోడ్లు మూసేయడంతో పాటు.. వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకే దారి ఏర్పాటు చేయాలని పేర్కొంది. కేసుల సంఖ్యను బట్టి 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్ల పరిధిలో కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఒకటి కంటే ఎక్కువ కేసులుంటే కనీసం 250 మీటర్ల పరిధిలో జోన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. అపార్ట్‌ మెంట్‌ లేదా గేటెడ్‌ కమ్యూనిటీలో పాజిటివ్‌ కేసు బయటపడితే వాటి పరిధి వరకు మాత్రమే కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేయొచ్చని స్పష్టం చేసింది. కారణం లేకుండా కంటైన్మెంట్‌ జోన్‌ లోపలికి, బయటకు వేళ్లేందుకు ఎవరినీ అనుమతించొద్దని ఆదేశించింది. బారికేడ్ల ఏర్పాటుతోపాటు, 24 గంటలపాటు పోలీసులు పహారా ఉండాలని సూచించింది. . కంటైన్మెంట్‌ జోన్‌కు వెళ్లే అన్ని మార్గాలను 8 అడుగుల ఎత్తున్న బారికేడ్లతో మూసేయాలని స్పష్టం చేసింది.

బోర్డుల ఏర్పాటు :

కంటైన్మెంట్‌ జోన్లని తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. జోన్ పరిధిలోని ప్రజలంతా కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ ఇంటి వద్దకే వస్తాయి. మధ్యాహ్నం 12 గంటల లోగా నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. .నిత్యవసరాల సరఫరాకు సంబంధించి ఓ నోడల్‌ అధికారిని కేటాయిస్తారు. ఆ అధికారి పేరు, ఫోన్‌ నంబర్‌ ను అందుబాటులో ఉంచుతారు. జోన్ లోని ప్రతి ఒక్కరి రాకపోకలను రికార్డు చేస్తారు. ఆ జోన్ లోని అందరికీ మాస్కులు అందజేస్తారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులు బయటపడిన ఇంటివారికి నిత్యావసరాలు పంపిణీ చేసే ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) ధరించాలి.

చెకప్ :

కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని రోజూ అధికారులు పర్యవేక్షిస్తారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలుంటే తక్షణమే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తారు. కరోనా టెస్ట్ లో నెగెటివ్‌ రిపోర్టు వస్తే వారిని తప్పనిసరి హోం ఐసోలేషన్‌లో ఉంచుతారు. ఏదైనా పాజిటివ్‌ కేసు వస్తే.. ప్రైమరీ కాంటాక్ట్‌ వివరాలను సేకరిస్తారు.

ఈ మేరకు కంటైన్మెంట్‌ జోన్ల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లోనూ అమలు చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ మరో ఉత్తర్వు జారీ చేశారు. GHMC పరిధిలో ఎక్కువ కేసులు నమోదు అయినట్టు అధికారులు గుర్తించారు. దాంతో GHMC కంటైన్మెంట్ ఏరియాలుగా, జోన్ల వారీగా విభజించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 139 కంటైన్మెంట్ జోన్లను గుర్తించారు. మొత్తంగా కరోనా కేసు బయటపడితే ఆ ఏరియాను అంతా తమ గుప్పిట్లో ఉంచుకుని వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు..

Tags : corona virus, possitive, contonment zone, ghmc, muncipal,

Next Story

Most Viewed