తెలంగాణ అసెంబ్లీ వాయిదా

by  |
తెలంగాణ అసెంబ్లీ వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. బడ్జెట్​ సమావేశాల సందర్భంగా గవర్నర్​ తమిళసై సౌందరరాజన్​ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల పురోగతికి ప్రాధాన్యమిస్తుందని, కరోనా నియంత్రణలో ముందున్నామని, నీటిపారుదల ప్రాజెక్టులతో పంటలకు నీళ్లందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని గవర్నర్​ పేర్కొన్నారు. ఇంకా పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచామని, సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించామని, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నట్లు గవర్నర్​ వివరించారు.

రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, అభివృద్ధిలో అగ్రగామిగా ఉందని, ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించామన్న గవర్నర్​.. వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.28 వేలకు పెరిగిందని, ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నామని, కోవిడ్‌ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందేనన్నారు. అయితే తెలంగాణ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని, కరోనాను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టామని, ఈ సందర్భంగా కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ ఎంతో కష్టపడ్డారంటూ గవర్నర్‌ తమిళిసై అభినందించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ సక్సెస్‌గా ముందుకు సాగుతోందని, విద్యుత్‌ రంగంలో తెలంగాణ అద్వితీయ విజయాలు సాధించిందని, అతి తక్కువ సమయంలో క్లిష్టమైన సమస్యలను అధిగమించామని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని, విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రం మరిందన్నారు. జాతయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్‌ తలసరి వినియోగం ఎక్కువగా ఉందని, విద్యుత్‌రంగ సంస్కరణపై కేంద్రం రాష్ట్రాన్ని ప్రశంసించిందని ఈ సందర్భంగా గవర్నర్​ గుర్తు చేశారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యకు మిషన్‌ భగీరథతో శాశ్వత పరిష్కారం లభించిందని, మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, గిరిజన గ్రామాలు, తండాలకు కూడా మంచినీటిని అందిస్తున్నామని, 57.26 లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వడంతో పాటుగా తెలంగాణను ఫోరైడ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించామని, భూగర్భ జలాలు పెరిగాయని, రెవెన్యూ వసూళ్లలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని, సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సమైఖ్య రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని గవర్నర్​ వివరించారు. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 20లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, కరువు ప్రాంతాలకు కూడా సాగునీరు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భక్త రామదాసు ప్రాజెక్ట్‌ 7 నెలల్లో పూర్తి చేశామని, త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తి అవుతుందని, డిండి, సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేస్తామన్నారు.

రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వ ఉంటుందని, రైతు బంధు ద్వారా ఎకరానికి రూ.10 వేల సాయం చేస్తున్నామని, 2.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు అవుతుందని, ఇది గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో 39,36,521 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, పెన్షన్ల కోసం ప్రతి ఏటా రూ.8,710 కోట్లు కేటాయిస్తున్నారని, ధాన్యం సేకరణలో తెలంగాణ తొలిస్థానంలో ఉందని, గత సీజన్​లో 64 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగినట్లు గవర్నర్​ తమిళసై వివరించారు. గవర్నర్​ ప్రసంగం అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్​ పోచారం ప్రకటించారు.

కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాన్ని ఖరారు చేయనున్నారు.

Next Story