కేసీఆర్‌కు మైహోమ్ సిమెంట్‌తో రాజకీయ సమాధి కడుతా.. తీన్మార్ మల్లన్న వార్నింగ్

by  |
Teenmar Mallanna
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీలో చేరారు. మల్లన్న జైలులో ఉన్న సమయంలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే, గతకొన్ని రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన మల్లన్న.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని మంగళవారం కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ మల్లన్నకు కండువా కప్పి, సభ్యత్వాన్ని అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్నకు బీజేపీ పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీజేపీ సభ్యత్వం అనేది పార్టీ నాకిచ్చిన తాడు.. దీంతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని అమరవీరుల స్థూపానికి కట్టేసేందుకే పార్టీలో చేరానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతేగాకుండా అమరవీరుల తల్లిదండ్రులను తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబసభ్యుల వీపులు పలగొట్టే కార్యక్రమంలో భాగంగానే జాయిన్ అయ్యానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగాడు అని మొదట తానే అన్నానని మల్లన్న గుర్తుచేశారు. నాడు తనతో ఎవరూ లేరని, ఈరోజు తనతోపాటు లక్షల గొంతుకలు ప్రశ్నిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వంపై ప్రశ్నించినందుకు తనపై 38 కేసులు పెట్టారని మల్లన్న తెలిపారు. కేసీఆర్ ఎక్కడ స్టార్ట్ చేశాడో.. అక్కడికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని హెచ్చరించారు. బీజేపీతో ప్రజల్లోకి మరింత వెళ్లే అవకాశం దక్కిందన్నారు. సీఎం కేసీఆర్‌కు మైహోమ్ సిమెంట్‌తో రాజకీయ సమాధి కడతామని మల్లన్న వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, రాఖేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed